
మలేరియా నిర్మూలనకు ఏసీఎం స్ప్రేచేయాలి
విజయనగరం ఫోర్ట్: మలేరియా నిర్మూలనకు ఇంటిలోపల గోడల మీద ఏసీఎం 5శాతం 9 ఆల్ఫా సైఫర్ మెత్రిన్ స్ప్రే చేయాలని ఇన్చార్జి కలెక్టర్ ఎస్.సేతు మాధవన్ అన్నారు. దీని కోసం జిల్లావ్యాప్తంగా 157 గ్రామాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. జిల్లాలో అమలు చేయనున్న మలేరియా నిర్మూలన కార్యక్రమంపై వ్యాధి ఎక్కువగా ఉన్న 18 మండలాలకు చెందిన ప్రత్యేకాధికారులు, ఎంపీడీఓలు, ఈఓపీఆర్డీలు, వైద్యాధికారులు, మలేరియా సబ్యూనిట్ అధికారులతో ఆయన బుధవారం తన చాంబర్ నుంచి జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మలేరియా వ్యాప్తిని నిరోధించడానికి మొత్తం 22 పీహెచ్సీల పరిధిలోని 157 గ్రామాల్లో రెండు విడతలుగా ఏసీఎం మందును పిచికారీ చేయనున్నట్లు తెలిపారు. గడిచిన నాలుగేళ్ల నివేదికల అధారంగా ప్రతి వెయ్యిమంది జనాభాకు రెండు లేదా అంతకన్నా ఎక్కువ మలేరియా కేసులు నమోదైన గ్రామాలను మలేరియా ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించి ఈ కార్యక్రమానికి ఎంపిక చేసినట్లు తెలిపారు. దీనిలో భాగంగా మే 1నుంచి జూన్ 15 వరకు మొదటి విడత, జూలై ఒకటి నుంచి ఆగస్టు 15 వరకు రెండో విడత ఏసీఎం మందులను పిచికారీ చేయనున్నట్లు తెలిపారు. దీని వల్ల గోడలపై వాలే దోమలు శక్తిని కోల్పోయి క్రమంగా నశించిపోతాయన్నారు. ఇలా మందు పిచికారీ చేసినప్పడు ఆ ఇంటి గోడలపై 10 నుంచి 12 వారాల పాటు ఆ మందు ప్రభావం ఉంటుందని, ఆలోగా గోడలను కడగడం గాని సున్నం వేయడం గాని చేయకూడదని చెప్పారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి సంపూర్ణ సహకారం అవసరమని కోరారు. సమావేశంలో డీఎంహెచ్ఓ డాక్టర్ జీవనరాణి, డీఎంఓ వై.మణి తదితరులు పాల్గొన్నారు.
ఇన్చార్జ్ కలెక్టర్ సేతు మాధవన్