
మలేరియా నివారణ మందులు లేవా ?
గుమ్మలక్ష్మీపురం: మలేరియా జ్వరం బారిన పడినవారికి అవసరమైన మందులు ప్రభుత్వాస్పత్రుల్లో లేకపోవడం రోగులను ఆవేదనకు గురిచేస్తోంది. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దంపడుతోంది. ప్రజారోగ్యాన్ని ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జ్వరంతో బాధపడుతున్న ఓ చిన్నారిని వైద్యం కోసం గుమ్మలక్ష్మీపురం మండలంలోని దుడ్డుఖల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఈ నెల 5న కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు రక్త పరీక్షలు నిర్వహించి మలేరియా జ్వరంగా గుర్తించారు. జ్వరం తగ్గేందుకు అవసరమైన మందులు ఆస్పత్రిలో లేవని చెబుతూ ఓపీ చీటీ వెనుక మందులు రాసి మెడికల్ స్టోర్కు వెళ్లి కొనుక్కోవాలంటూ తిప్పిపంపించారు. సమాచారం తెలుసుకున్న వైస్ ఎంపీపీ నిమ్మక లక్ష్మణరావు స్పందిస్తూ.. జబ్బు చేస్తే మందులు ప్రైవేటు మెడికల్ సోర్కు వెళ్లి కొనుక్కుంటే ప్రభుత్వాస్పత్రి ఉండేది ఎందుకని.. గిరిజన ప్రజలకు ఇలాగేనా వైద్య సేవలు అందించేదంటూ మండిపడ్డారు. అవసరమైన మందుల సరఫరాలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తప్పుబట్టారు.
ప్రజలపై విద్యుత్ చార్జీల భారం అన్యాయం
● మాజీ ఎమ్మెల్యే కళావతి
వీరఘట్టం: అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలను తగ్గిస్తామని కళ్లబొల్లి మాటలతో ప్రజలను మోసగించిన కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ప్రజలపై విద్యుత్చార్జీల భారం మోపడం అన్యాయమని మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి అన్నారు. వండువ గ్రామంలో మీడియాతో ఆమె మంగళవారం మాట్లాడారు. రాష్ట్ర ప్రజల విద్యుత్ అవసరాల కోసం గత వైఎస్సార్సీపీ ప్రభు త్వం యూనిట్ రూ.2.49 చొప్పున ఏడువేల మెగావాట్ల విద్యుత్ను అతి తక్కువ ధరకు కొనుగోలు చేసిందన్నారు. నేటి కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు యూనిట్ విద్యుత్ను రూ.4.60లు చొప్పున కొనుగోలు చేసేందుకు యాక్సెస్తో చేసుకున్న ఒప్పందంతో ప్రజలపై అదనంగా రూ.400 కోట్ల భారం పడుతోందన్నారు. గత ప్రభుత్వం సెకీతో యూనిట్ ధర రూ.2.49కు ఒప్పందం చేసుకుంటే కూటమి నాయకులు గగ్గోలు పెట్టారని, రాష్ట్రం దివాలా తీస్తోందంటూ నానా యాగీ చేశారని, ఇప్పుడు చంద్రబాబునాయుడు అదే విద్యుత్ను యూనిట్కు రూ. 4.60లు చెల్లించేలా 25 ఏళ్ల ఒప్పందం చేసుకుంటే... రాష్ట్రాన్ని ఉద్దరించినట్లా అని ప్రశ్నించారు. సీఎం అనాలోచిత చర్యల వల్ల ప్రజలపై మరో పాతికేళ్లు విద్యుత్ భారం పడుతుందన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రజలు అడుగుతుంటే రాష్ట్ర ఖజానా ఖాళీ అంటూ ప్రతిసభలో సమాధానం చెబుతున్న ముఖ్యమంత్రి ఎవరిని ఉద్దరించడానికి ఇంత ప్రజాధనాన్ని విద్యుత్ కొనుగోలు పేరిట దుబారా చేస్తున్నారో చెప్పాలన్నారు. విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ పోరాడుతుందన్నారు.
పోలమ్మ తల్లిని దర్శించిన రాజన్నదొర
మక్కువ: మండలంలోని గోపాలపురం గ్రామదేవత కోన పోలమ్మ తల్లిని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర మంగళవారం దర్శించుకున్నారు. గ్రామదేవత పండగను పురస్కరించుకుని మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర, జెడ్పీటీసీ మావుడి శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు మావుడి రంగునాయుడు గ్రామానికి చేరుకోవడంతో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున స్వాగతం పలికారు. కోనపోలమ్మ తల్లిని మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దండి శ్రీనివాసరావు, తదితర నాయకులు పాల్గొన్నారు.

మలేరియా నివారణ మందులు లేవా ?