
‘తోటపల్లి’ నీరిచ్చేది ఎప్పుడు ‘బాబూ’?
పాలకొండ: తోటపల్లి ప్రాజెక్టు నుంచి పాలకొండ, వీరఘట్టం, జియ్యమ్మవలస మండలాల్లో 8,550 ఎకరాలకు సాగునీరు అందడం లేదు.. బుడ్డిడి వద్ద సైఫూన్ పాడైపోయినా పట్టించుకోవడం లేదు.. కాలువల అభివృద్ధికి బడ్జెట్లో నిధులు కేటాయించాలన్న రైతుల విన్నపాన్ని ప్రభుత్వం విస్మరించింది.. పైసా నిధులు విదల్చలేదు.. ఈ ఏడాది ఖరీఫ్కు కూడా వరి పంటకు సాగునీరు అందే పరిస్థితి లేదంటూ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేశారు. ప్రభుత్వం స్పందించి తోటపల్లి కాలువలను బాగుచేయాలని కోరుతూ పాలకొండ కోటదుర్గమ్మ ఆలయం నుంచి సబ్కలెక్టర్ కార్యాలయం వరకు మంగళవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఆర్డీఓ కార్యాలయం ఏవో సావిత్రికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బంటు దాస్, సంఘ ప్రతినిధులు కండాపు ప్రసాదరావు, ఇ.సింహద్రి, గంగుల శ్రీనివాసరావు, సోమశేఖర్, రవి, గౌరినాయుడు, రౌతు సోముబాబు, సింహాచలం, తదితరులు పాల్గొన్నారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దావాల రమణారావు ధర్నాకు మద్దతు తెలిపారు.
కాలువలను బాగుచేయాలంటూ రైతుల ధర్నా