
మన్యం బంద్ విజయవంతం
● గిరిజనులకు ప్రత్యేక డీఎస్సీ విడుదల చేయాలని డిమాండ్ ● పార్వతీపురం కలెక్టరేట్ వద్ద నిరసన ● గుమ్మలక్ష్మీపురం, కురుపాంలలో ధర్నాలు
పార్వతీపురం టౌన్/గుమ్మలక్ష్మీపురం(కురుపాం): గిరిజనులకు ప్రత్యేక డీఎస్సీ నిర్వహించాలని గిరిజన సంఘాలు శుక్రవారం తలపెట్టిన మన్యం బంద్ విజయవంతంమైంది. ఏజెన్సీ స్పెషల్ డీఎస్సీ సాధన రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పార్వతీపురం, గుమ్మలక్ష్మీపురం, కురుపాంలలో ఆందోళనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఎస్సీలో ఏజెన్సీ ఐటీడీఏల పరిధిలోని 766 పోస్టుల్లో ఆదివాసీలకు దక్కేది కేవలం 42 పోస్టులు మాత్రమేనని, ఇది చాలా అన్యాయమని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కె.రామస్వామి అన్నారు. ఆదివాసీలకు ప్రత్యేక డీఎస్సీ, ఉద్యోగ అవకాశాల్లో వంద శాతం రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పార్వతీపురం కలెక్టరేట్ వద్ద గిరిజన, ప్రజా సంఘాల నాయకులతో కలిసి నిరసన తెలిపారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయడంతో ఆదివాసీ యువతకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. 94 శాతం నివాసం ఉన్న గిరిజనులకు 6 శాతం ఉద్యోగాలు, 6 శాతం నివాసం ఉన్న గిరిజనేతరులకు 94 శాతం ఉద్యోగాలు కేటాయించడం తగదన్నారు. జీఓ నంబర్ 3 ప్రకారం ఏజెన్సీలోని ఉద్యోగాలు వందశా తం ఆదివాసీ యువతకు కేటాయించాలన్నారు. కార్యక్రమంలో గిరిజన సంఘ నాయకులు పి. రాము, కోలక అవినాష్, మండంగి రమణ, సన్యాసిరావు, మండంగి శ్రీనివాసరావు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి బి.వి.రమణ, జిల్లా కోశాధికారి గొర్లి వెంకటరమణ, నాయకులు బి.సూరిబాబు, రైతు సంఘం నాయకులు బంటు దాసు, డీవైఎఫ్ఐ నాయకులు పి.రాజశేఖర్ పాల్గొన్నారు.

మన్యం బంద్ విజయవంతం