
జీడికి దక్కని మద్దతు!
● దళారుల పాలవుతున్న గిరిజన రైతులు
● ప్రకటనలకే పరిమితమవుతున్న
అధికారుల హామీలు
సాక్షి, పార్వతీపురం మన్యం :
ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులకు అటవీ ఉత్పత్తుల్లో ఆర్థిక దన్నుగా నిలిచేది జీడి పంటే. కొండ పోడు భూముల్లో జీడితోటలనే సాగు చేసుకుని జీవనం సాగిస్తుంటారు. ఇటువంటి పంట విషయంలో ప్రభుత్వం వారికి మద్దతుగా నిలవడం లేదు. సీజన్ దాటిపోతున్నా.. జీడి పిక్కల కొనుగోలు విషయమై కనీస దయ కరవవుతోంది. కొంతకాలంగా మార్కెట్లో సరైన ధర పొందలేకపోతున్నారు. మరోవైపు మొదట్లోనే తెగుళ్లు, ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట దిగుబడి గణనీయంగా తగ్గిపోతోంది. దీనివల్ల గిరిజన రైతులు నష్టాలు చవిచూస్తున్నారు. జీడి పిక్కలకు కనీస మద్దతు ధర చెల్లించాలని కొన్నాళ్లుగా రైతులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నా ఫలితం ఉండటం లేదు.
వేలమంది గిరిజన రైతులకు ఆధారం..
జిల్లాలో దాదాపు 68 వేల ఎకరాల్లో జీడి తోట లు సాగులో ఉన్నాయి. 30 వేల మంది రైతు లు వీటిపైనే ఆధార పడి జీవిస్తున్నారు. ఇందులో అత్యధికం గిరిజనులే. జీడిపిక్కల దిగు బడి దాదాపు మార్చి నాటికి వస్తున్నప్పటికీ.. ఏప్రిల్ వచ్చినా జీసీసీ ద్వారా కొనుగోలుకు చర్యలు తీసు కోవడం లేదు. ఇప్పటికే గిరిజనులు దాదాపు 60 శాతం జీడి పిక్కలు దళారులకు విక్రయించేశారు.
సిండికేట్గా మారుతున్న వ్యాపారులు
జిల్లాలోని సీతంపేట, కురుపాం, గుమ్మలక్ష్మీపురం, సాలూరు తదితర ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు జీడి తోటలపైనే చాలా ఏళ్లుగా బతుకుతున్నారు. ప్రసుత్తం జీడి పిక్కల ధర మార్కెట్లో కిలో రూ.180 వరకు ఉంది. గిరిజనులకు పంట చేతికందేసరికి దళారులు, వ్యాపారులు సిండికేట్గా మారుతున్నారు. జీడి పిక్కలను కిలో రూ.100 నుంచి రూ.130లోపే కొనుగోలు చేస్తున్నారు. దీంతో గిరిజన రైతులకు పెట్టుబడి కూడా దక్కడం లేదు. వరి, మొక్కజొన్న, పత్తి మాదిరి జీడి పిక్కలకు మద్దతు ధర ఇవ్వాలని.. జీసీసీ, వెలుగు ద్వారా కొనుగోలు కేంద్రాలు తెరవాలని ఎప్పటి నుంచో ప్రజాసంఘాల నాయకులు కోరుతున్నా ఫలితం దక్కడం లేదు. వాస్తవానికి మన్యం జిల్లా జీడికి మంచి డిమాండ్ ఉంది. ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు ఏటా ఈ సీజన్ అధికంగా రవాణా అవుతోంది. కనీసం జీడి పిక్కలను నిల్వ చేసుకునేందుకు గోదాములు కూడా జిల్లాలో అందుబాటులో లేవు.
ప్రకటనలకే పరిమితమవుతున్న ప్రాసెసింగ్ యూనిట్లు
జీడి పిక్కల ద్వారా మంచి ఆదాయం పొందేలా
ఐటీడీఏల పరిధిలో ప్రాసెసింగ్ యూనిట్లను ప్రారంభించాలని అధికారులు తరచూ ప్రకటనలైతే చేస్తున్నారు గానీ.. ఆచరణలోకి రావడం లేదు. జీడిపప్పు మార్కెటింగ్లో రైతులు దళారుల బారిన పడకుండా వన్ధన్ వికాస్ కేంద్రాల ద్వారా మంచి ధర కల్పించేలా చూడాలని ఐటీడీఏ, వ్యవసాయ, ఉద్యాన శాఖాధికారులకు ఉన్నతాధికారులు ఆదేశాలిస్తున్నారు. గుమ్మలక్ష్మీపురం, సాలూరుల్లో యూనిట్లను స్థాపించనున్నట్లు చెబుతున్నారు. ఇవన్నీ ప్రకటనలకే పరిమితమవుతున్నాయి.
జీసీసీ ద్వారా కొనుగోలు చేయాలి..
జీడి పిక్కలకు కిలో రూ.200, 80 కిలోల బస్తా రూ.16 వేల చొప్పున మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని పలు సందర్భాల్లో గిరిజన, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. వారి రోదనను పట్టించుకునే తీరిక ఎవరికీ ఉండటం లేదు. ఇటీవల పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏల వద్ద పెద్ద ఎత్తున ధర్నాలు కూడా నిర్వహించారు. అయినప్పటికీ అధికారుల్లో చలనం రాలేదని గిరిజన సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు.

జీడికి దక్కని మద్దతు!