● ఆర్థిక బకాయిలు, విద్యారంగ సమస్యలపై యూటీఎఫ్ పోరుబాట ● రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతీయ సదస్సులు నిర్వహించేందుకు సన్నాహాలు
వీరఘట్టం: ఇటీవల జరిగిన ఉత్తరాంధ్ర ఉపాధ్యా య ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వంపై ఉపాధ్యాయులు తమ వ్యతిరేకతను ఓటుతో చెప్పారు. కూటమి ప్రభుత్వం ప్రతిపాదించిన ఎమ్మెల్సీ అభ్యర్థిని ఓడించారు. ఉపాధ్యాయ ఉద్యోగుల ఆర్థిక బకాయిలు, విద్యారంగ సమస్యలను పరిష్కరిస్తా మని సార్వత్రిక ఎన్నికల ముందు కూటమి నాయకులు ఇచ్చిన హామీల అమలులో నిర్లక్ష్యంపై నిలదీసేందుకు యూటీఎఫ్ పోరుబాటకు పూనుకుంది. తొలుత ఈ నెల 16న చలో విజయవాడకు పిలుపునిచ్చింది. ఈ నెల 23న రాజమండ్రిలో, ఈనెల 31 విశాఖపట్టణంలో, ఏప్రిల్ 5న కర్నూలులో, ఏప్రిల్ 6న తిరుపతిలో పోరుబాట కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ ఐదు ప్రాంతాల్లో నిర్వహించే పోరుబాటలో ప్రతి పట్టణంలో వెయ్యి మంది ఉపాధ్యాయులతో పోరుబాట చర్చా కార్యక్రమాలు నిర్వహించనుంది.