● జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ● ఒడిశాలో పట్టాలు తప్పిన కోరమండల్ ఎక్స్ప్రెస్ ● రైలు ప్రమాద బాధితుల వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ల ఏర్పాటు ● పలు రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
విజయనగరం టౌన్:
ఒడిశాలో కోరమండల్, యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ శుక్రవారం రాత్రి పట్టాలు తప్పాయి. 13 భోగీలు పట్టాలు తప్పగా, నాలుగు భోగీలు పూర్తిగా ఛిద్ర మయ్యాయి. 50 మందికి పైగా మృతి చెందగా, 179 మందికి పైగా గాయాలపాలైనట్టు ప్రాథమిక సమాచారం. ఒడిశా ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. బాధితుల సమాచారం తెలుసుకునేందుకు విజయనగరం రైల్వేస్టేషన్లో టోల్ ఫ్రీ నెంబర్లను రైల్వేశాఖ అధికారులు ఏర్పాటు చేశారు. విజయనగరం జిల్లా కేంద్రంలో 08922–221202, 221206 నంబర్లను, శ్రీకాకుళంలో 08942– 286213, 286245 నంబర్లకు ఫోన్చేసి సమాచారం తెలుసుకోవచ్చన్నారు. కోర మండల్ రైలు విశాఖ తర్వాత నేరుగా బరంపురంలో ఆగుతుంది. అందువలన జిల్లాకు సంబంధించి ప్రయాణీకులు ఉండకపోవచ్చని రైల్వే అధికారులు భావిస్తున్నారు.
పలు రైళ్లు రద్దు
విజయనగరం జిల్లా మీదుగా హౌరా వైపు వెళ్లే పలు రైళ్లను రైల్వేశాఖ రద్దుచేసింది. రైలు నంబర్ 12863 హౌరా–బెంగుళూరు ఎక్స్ప్రెస్ను హౌరాలో రద్దు చేశారు. 12839 హౌరా– చైన్నె సెంట్రల్ మెయిల్ను హౌరాలో రద్దు చేశారు. 12840 చైన్నె సెంట్రల్– హౌరా రైలు ఖర్గపూర్ నుంచి వయా జారోలి వైపు మళ్లించారు. 18048 వాస్కోడీగామా–షాలీమార్ రైలు, 22850 సికింద్రాబాద్– షాలీమార్ వీక్లీ ట్రైన్ కటక్ వైపు మళ్లించారు.
సహాయం అందిస్తాం..
రైలు ప్రమాద బాధితుల్లో జిల్లాకు చెందిన వారు ఎవరైనా ఉంటే వారికి అండగా ఉంటామని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు శుక్రవారం ప్రకటనలో తెలిపా రు. రైలు ప్రమాదం చోటుచేసుకోవడం చాలా బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు తీవ్రసంతా పం వ్యక్తం చేస్తున్నామన్నారు. క్షతగాత్రులకు ఒడిశా ప్రభుత్వం, రైల్వేశాఖ అన్నిరకాల ఏర్పాట్లు చేసి ప్రాణాలు దక్కేలా చూడాలని కోరారు.