దాచేపల్లి: భారీ స్థాయిలో రంగురాళ్ల గుట్టును అధికారులు రట్టు చేశారు. దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని ఓ గోడౌన్లో భద్రపరిచిన రంగురాళ్లను అటవీ శాఖ, విజిలెన్స్ అధికారులు శుక్రవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో స్థానిక పోలీసుల సహాయంతో అటవీ శాఖ, విజిలెన్స్ అధికారులు గోడౌన్లో భద్రపరిచిన రంగురాళ్లు (క్రిస్టల్ క్వార్జ్) స్వాధీనం చేసుకున్నారు. దాచేపల్లి మండలం శంకరాపురం గ్రామ సమీపంలో ఉన్న కొండ నుంచి ఈ రంగురాళ్లు వెలికి తీసినట్లు అధికారులు గుర్తించారు. రంగురాళ్ల వివరాలు అధికారులు సేకరిస్తున్నారు. పూర్తిస్థాయిలో ఆధారాలు సేకరించిన తరువాత వీటి విలువ ఎంత అనేది తెలుస్తుంది. స్థానికుల సమాచారం సుమారు రూ.కోటి పైనే రంగురాళ్ల విలువ ఉంటుందంటున్నారు. స్థానిక సీఐ రాజేష్, అటవీశాఖ అధికారులు, విజిలెన్స్ అధికారులు సంఘటనా స్థలంలో ఉండి ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులను వివరణ కోరగా, పంచనామా నిర్వహిస్తున్నామని, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు.


