టీడీపీకి ఓటమి భయం పట్టుకుంది
● 2029 ఎన్నికల్లో టీడీపీ, జనసేనకు డిపాజిట్లు కూడా రావు
● మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ● పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతిపక్షంపై జరుగుతున్న దాడులన్నిటికీ లోకేశ్ కారకుడన్నారు. 2029 ఎన్నికల్లో టీడీపీ, జనసేనకు డిపాజిట్లు రావని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరైన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కన్నెత్తి చూసేందుకు కూటమి నేతలు భయపడ్డారని చెప్పారు. అంబటి ఇంటిపై దాడికి తెగబడిన వారిపై ఎటువంటి కేసులు లేవని, ఆయనపై అక్రమంగా మోపిన 35 కేసుల్లోనూ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందని వివరించారు. బీసీ నేత జోగి రమేష్ ఇంటిపై కూడా దాడి చేశారని మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే సమర్థత లేక ఈ విధంగా భౌతిక దాడులకు పాల్పడుతున్నారని ఎద్దేవా చేశారు.
● మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ పవిత్రమైన తిరుమల తిరుపతి లడ్డూలో ఏ కల్తీ లేదని, కూటమి నేతల మాటల్లో మాత్రమే కల్తీ ఉందని విమర్శించారు. అంబటి కుటుంబంపై దాడి అమానుషమన్నారు. మహిళలు ఉన్నారన్న ఆలోచన లేకుండా దాడికి దిగటం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. స్థానిక ఎమ్మెల్యే గళ్లా మాధవి, ఆమె భర్త దగ్గరుండి దాడులు చేయటం శోచనీయమన్నారు.
● ఉభయ గోదావరి జిల్లాల కాపు సంఘం అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ భీమవరం నియోజకవర్గ ఇన్చార్జి చిన్నిమిల్లి వెంకటరాయుడు మాట్లాడుతూ కాపులంటే తొలి నుంచి తెలుగుదేశం పార్టీకి గిట్టదన్నారు. మహిళలు ఉన్నారని కూడా చూడకుండా అంబటి ఇంటిపై దాడి చేయడం అమానుషమన్నారు. దివంగత వంగవీటి మోహనరంగాను హత్య చేయించిన నీచుడు చంద్రబాబు అని ఆరోపించారు. సీనియర్ కాపు నేత ముద్రగడ పద్మనాభంను తెలుగుదేశం పార్టీ తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని దుయ్యబట్టారు. ఇటీవలే కాపు యువకులను టీడీపీ నేతలు కార్లుతో తొక్కించి హత్యాప్రయత్నం చేసిన పరిస్థితులు చూశామన్నారు.
● మాజీ డెప్యూటీ సీఎం అంజాద్బాషా మాట్లాడుతూ టీడీపీ వైఫల్యాలను ప్రశ్నించే గొంతులను నొక్కే కార్యక్రమంలో భాగంగానే అంబటి రాంబాబుపై అక్రమ కేసులు నమోదు చేసి జైలుకు పంపించారని మండిపడ్డారు. ఆ ఏడుకొండలస్వామి శాపం టీడీపీ ప్రభుత్వానికి తప్పకుండా తగులుతుందని స్పష్టం చేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల కాలంలో ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు.
● కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి మాట్లాడుతూ పక్కా ప్లాన్ ప్రకారం అంబటి నివాసం, కార్యాలయంపై దాడికి తెగబడ్డారన్నారు. ఆయనపై జరిగిన హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గుంటూరు వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి దగ్గరుండి దాడి చేయించారన్నారు. అంబటి కుటుంబానికి అన్ని విధాలుగా వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని చెప్పారు.
● మాజీ జ్యూడీషియల్ జడ్జి జడ శ్రావణ్కుమార్ మాట్లాడుతూ ప్రశ్నించేవారి ఇళ్లపై దాడులకు చేసేందుకు రాష్ట్రంలోని ప్రజలు టీడీపీ ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది అని ప్రశ్నించారు. ప్రజాస్వామికంగా ఎమ్మెల్యేగా గెలిచిన గళ్లా మాధవి టీడీపీ మేనిఫెస్టోకు, రాజ్యాంగానికి తేడా తెలియకుండా ఆమె మాట్లాడారని అన్నారు.
● మాజీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అంబటి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిలో మనో ధైర్యం నింపారు.
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్)/గుంటూరు ఎడ్యుకేషన్: రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వానికి ఓటమి భయం పట్టుకుందని మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. బుధవారం గుంటూరు సిద్ధార్థ నగర్లోని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పెద్దిరెడ్డి పరామర్శించారు. అంబటి సతీమణి విజయలక్ష్మి, ఆయన కుమార్తెలు మౌనిక, మనోజ్ఞతో వారి ఇంటిపై జరిగిన దాడి ఘటన గురించి ఆరా తీశారు. ఇంకా మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్, ఉభయగోదావరి జిల్లాల కాపు సంఘం అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ భీమవరం నియోజకవర్గ ఇన్చార్జి చిన్నిమిల్లి వెంకటరాయుడు, మాజీ డెప్యూటీ సీఎం అంజాద్బాషా, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మాజీ జ్యూడీషియల్ జడ్జి జడ శ్రావణ్కుమార్లు కూడా అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించి మాట్లాడారు.
హెరిటేజ్ పెరుగులో కల్తీ జరిగిందని నివేదిక వచ్చిందని, ఏడుకొండల వెంకన్నతో పెట్టుకుంటే కర్మ రిటర్న్ అవ్వటం తఽథ్యమని హెచ్చరించారు. శ్రీశైలం లడ్డూలో కూడా కల్తీ జరిగిందని అంటూ కొత్త ఆరోపణలకు తెరదీస్తున్నారన్నారు.
వీరి వెంట పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ, తాడికొండ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు, తూర్పు సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ ఉన్నారు.