వీఐపీ దర్శన టికెట్లకు విశేష స్పందన
కారు పాసుల్లో కోత పెట్టాలి
ఆన్లైన్లో త్రికోటేశ్వర స్వామి దర్శన టికెట్లు విక్రయం
నరసరావుపేట రూరల్: మహాశివరాత్రి పర్వదినాన కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు ఈ ఏడాది నూతనంగా ప్రవేశపెట్టిన వీఐపీ దర్శనం ఆన్లైన్ టికెట్లకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తుంది. ఈనెల 10వ తేదీ నుంచి ఆన్లైన్లో దర్శన టికెట్లు అందుబాటులో ఉంచారు. దేవదాయ శాఖ టెంపుల్స్ వెబ్సైట్లో ఆలయంలో భక్తులకు కల్పిస్తున్న దర్శన టికెట్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రత్యేక దర్శనం (రూ.100), శీఘ్ర దర్శనం (రూ.200) టికెట్లతో పాటు వీఐపీ దర్శనం, అభిషేక దర్శనం టికెట్లు ఇందులో ఉన్నాయి. ఈనెల 9వ తేదీ సాయంత్రం 4గంటల నుంచే ఆన్లైన్లో టికెట్లు విక్రయాన్ని ప్రారంభించారు. అభిషేక దర్శన టికెట్లు 3వేలు, వీఐపీ దర్శన టికెట్లు 2వేలు, శీఘ్ర దర్శనం 11వేలు, ప్రత్యేక దర్శనం 9వేలు టికెట్లు ఆన్లైన్లో విడుదల చేశారు.
కోటప్పకొండ తిరునాళ్ల సందర్భంగా పోలీసులు జారీ చేసే కారు పాసులు, వీఐపీ బస్ పాస్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. పాస్లు కలిగి ఉన్న కార్లును కొండ దిగువున టోల్గేట్ వరకు అనుమతిస్తారు. అక్కడి నుంచి ఆర్టీసీ బస్సుల్లో వీఐపీ పాస్లతో కొండపైకి చేరుకుంటారు.
కారు పాసులు విచ్చలవిడిగా జారీ చేస్తుండటంతో కొండ దిగువున పార్కింగ్ సమస్య తలెత్తుతుంది. జాగరణ జరిగే సమయంలో పెట్లూరివారిపాలెం రోడ్డులో ట్రాఫిక్ నిలిచిపోవడానికి కార్లు రద్దీ ప్రధాన కారణంగా ఉంది.
పెట్లూరివారిపాలెం రోడ్డు నుంచే ఆర్టీసీ బస్సులు కొండకు చేరుకుంటాయి. టోల్గేట్ సమీపంలో కారు పార్కింగ్ వద్ద మెయిన్రోడ్డుపై తరచూ కార్లు నిలిచిపోతుంటాయి. ఇక్కడే ట్రాఫిక్ జామ్ ప్రారంభమవుతుంది.
వాహనాల రద్దీతో కిలోమీటర్ల మేర నిలిచిపోయి భక్తులు ట్రాఫిక్లో చిక్కుకోవడం పరిపాటిగా మారింది.
వీఐపీ పాస్లను రద్దు చేసినట్టుగా కారు పాసుల్లో కూడా కోత పెడితే ట్రాఫిక్ జామ్ సమస్యను కొంత వరకు తగ్గించవచ్చని భక్తులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు కారు పాస్ల జారీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పోలీసు అధికారులు చెబుతున్నారు.


