
మావోయిస్టుల మృతదేహాలను అప్పగించి శాంతి చర్చలు జరపాలి
నరసరావుపేట: మావోయిస్టులు చలం, భాస్కర్ మృతదేహాలను బంధువులకు అప్పగించి ఆ పార్టీతో శాంతి చర్చలు జరపాలని వామపక్షాలు, ప్రజా సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం కోటప్పకొండరోడ్డులోని సీపీఎం కార్యాలయంలో ఆదివాసి హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఉమ్మడి గుంటూరు జిల్లా కన్వీనర్ కోలా నవజ్యోతి అధ్యక్షతన రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. మధ్యభారతంలో ఆపరేషన్ కగారు పేరుతో జరుగుతున్న ఎన్కౌంటర్లు నిలిపివేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని, మృతదేహాలను కుటుంబ సభ్యులకు ఇవ్వాలని రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది. సీపీఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయ్కుమార్ మాట్లాడుతూ కగారు పేరుతో మావోయిస్టులను చంపడం సరైంది కాదన్నారు. వారు చర్చల కోసం ముందుకు వస్తే ఆ పనిచేయకుండా కాల్చి చంపి శవాలు కూడా ఇవ్వకపోవడం ఏరకమైన ప్రజాస్వామ్యమో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంశాఖా మంత్రి అమిత్ షా చెప్పాలని అన్నారు. దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, మృతదేహాలను తక్షణమే కుటుంబ సభ్యులకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ మాట్లాడుతూ ఎన్కౌంటర్ల పేరుతో మావోయిస్టులను చంపడం చట్ట వ్యతిరేకమని, తమ పార్టీ మొదటి నుండి వ్యతిరేకిస్తుందన్నారు. శవాలు ఇస్తే తాము చేసిన చిత్రహింసలు ఎక్కడ బయట పడతాయోనని ఇవ్వట్లేదని, తక్షణమే ఇటీవల ఎన్కౌంటర్లలో మృతిచెందిన చర్చిల సుధాకర్ మృతదేహాన్ని బంధువులకు ఇవ్వాలని కోరారు. వాల్పోస్టర్ ఆవిష్కరించారు. అమరుల బంధుమిత్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బి.అంజమ్మ, పీడిఎం రాష్ట్ర నాయకులు వై.వెంకటేశ్వరరావు, కేఎన్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కృష్ణ, పీకేఎస్ జిల్లా కమిటీ సభ్యులు కంబాల ఏడుకొండలు, పీడీఎం నాయకులు నల్లపాటి రామారావు, ఉమ్మడి గుంటూరు జిల్లా ఆదివాసి హక్కుల పోరాట సంఘీభావ వేదిక జిల్లా కో–కన్వీనర్ డి.సుధాకర్ పాల్గొన్నారు.
డిమాండ్ చేసిన వాపమక్ష,ప్రజాసంఘాల నాయకులు సీపీఎం కార్యాలయంలో రౌండ్టేబుల్ సమావేశం