పర్లాకిమిడి: స్థానిక మార్కెట్ జంక్షన్లో కొనసాగుతున్న గ్రామ దేవత నీలమ్మ సంబరాల్లో భాగంగా ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి సోమవారం రాత్రి అమ్మవారి శోభాయాత్ర ఉత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గజపతి జిల్లా ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వైశ్యరాజు బాలాజీ రాజు, మార్కెట్ జంక్షన్ అమ్మవారి సంబరాల కమిటీ అధ్యక్షుడు జామి ప్రశాంత్, వస్త్ర వ్యాపారి బోయిన కృష్ణ, బరాటం శ్రీకాంత్లు ఆయనను సన్మానించారు.
ఆర్థిక సాయం అందజేత
పర్లాకిమిడి: ఇటీవల ఈదురుగాలులతో కురిసిన వర్షానికి గుసాని సమితి బాగుసల గ్రామంలో రావిచెట్టు ఒక దుకాణంపై పడడంతో మృతి చెందిన చిరువ్యాపారి కె.మన్మథరావు కుటుంబాన్ని పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి మంగళవారం పరామర్శించారు. అలాగే ఆదే చెట్టుకింద ఆశ్రయం పొంది తీవ్రగాయాలైన వి.శ్రీనివాసరావు కుటుంబాన్ని కూడా పరామర్శించారు. రెండు బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే ఆర్థిక సాయం అందజేశారు. దుకాణంపై పడివున్న చెట్టును త్వరితగతిన తొలిగించాలని డీఎఫ్ఓ కె.నాగరాజును కోరారు. ఆయనతో పాటు గుసాని సమితి అధ్యక్షుడు ఎన్.వీర్రాజు, బాగుసల సర్పంచ్ టి.భీమరాజు, జెడ్పీటీసీ ఎస్.బాలరాజు తదితరులు ఉన్నారు.
బాకై ్సట్ తవ్వకాల సామర్థ్యం పెంచాలి
రాయగడ: కొడింగమాలి బాకై ్సట్ తవ్వకాల సామర్థ్యాన్ని మరింత పెంచాలని కొరాపుట్ జిల్లా లక్ష్మీపూర్ కొడింగమాలి శాంతి సుభాష్ ఖని పరివాహన్ సొసైటీ సభ్యులు కోరారు. ఈ మేరకు కలెక్టర్ అశుతోష్ కులకర్ణిని మంగళవారం కలిసి వినతిపత్రం అందజేశారు. రాయగడ, కొరాపుట్ జిల్లాల సరిహద్దులోని కొడింగమాలి ప్రాంతంలో ప్రస్తుతం ఏడాదికి కేవలం 3 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన బాకై ్సట్ తవ్వకాలు కొనసాగుతున్నాయన్నారు. ఈ తవ్వకాల కారణంగా ప్రభావిత ప్రాంతాల్లో నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని, అదేవిధంగా పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందడంతో పాటు విద్య, వైద్య సౌకర్యాలు వంటివి ప్రజలకు చేరువవుతున్నాయని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తవ్వకాల సామర్థ్యాన్ని అదనంగా మరో 3 మెట్రిక్ టన్నుల వరకు పెంచాలని కోరారు. దీనివలన ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. సొసైటీ అధ్యక్షుడు అంకుజ్ ఖొర నేతృత్వంలో సభ్యులు పాల్గొన్నారు.
మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ
మల్కన్గిరి: మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని ఎంపీ బలభద్ర మాఝి అన్నారు. స్థానిక జిల్లా జైలులో మంగళవారం మొక్కలు నాటారు. పలు ఔషధ మొక్కలు నాటి వాటి ప్రయోజనాలు వివరించారు. అంతకుముందు జైలు అధికారి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. జైలు పరిసరాలను పరిశీలించారు. ఖైదీలకు కల్పిస్తున్న సౌకర్యాలపై చర్చించారు. కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్, ఎంపీ ప్రతినిధి సంజయ్ సర్కార్, జిల్లా సమాజ్ దినపత్రిక ప్రతినిధి గోపికృష్ణ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.


