పార్వతీపురం: పదోతరగతి ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో పార్వతీపురం మన్యం జిల్లా వరసగా నాలుగోసారి నంబర్ వన్ స్థానంలో నిలిచిందని మంత్రి సంధ్యారాణి అన్నారు. ఈ మేరకు మంగళవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని మన్యం కళావేదికలో నిర్వహించిన జిల్లాస్థాయి టాపర్స్ సన్మాన కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ, మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి పాల్గొని విద్యార్థులను సన్మానించి, జ్ఞాపికలను అందజేసి అభినందించారు. జిల్లాలో 10500మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 9వేల మంది విద్యార్థులు ఫస్ట్క్లాస్లో ఉత్తీర్ణత సాధించడం విశేషమన్నారు. అంతేకాకుండా సుమారు 500మంది విద్యార్థులు 590 మార్కులకు పైగా సాధించి జిల్లా గర్వపడేలా చేశారని గుర్తుచేశారు. విద్యాశాఖ ప్రవేశపెట్టిన వందరోజుల ప్రణాళిక విజయవంతమై ఈ ఫలితాలకు దోహదపడిందని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి, ఐటీడీఏ పీఓ ఆర్.వైశాలి, డీఇఓ పి.బ్రహ్మాజీరావు, తదితరులు పాల్గొన్నారు.


