● హైటెక్ మెడికల్ కళాశాలల చైర్మన్ డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి
పర్లాకిమిడి: చాలా దిగువస్థాయి నుంచి కార్పొరేట్ ఆస్పత్రుల చైర్మన్ స్థాయికి ఎదగటానికి కారణం కష్టపడి పనిచేసే తత్వం వల్లే సాధ్యపడిందని, పర్లాకిమిడి కర్మభూమి నన్ను ఎక్కడికో తీసుకెళ్లిందని హైటెక్ ఆస్పత్రులు, నర్సింగ్ కళాశాలల చైర్మన్ డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి అన్నారు. ఆర్.సీతాపురం సెంచూరియన్ వర్సిటీలో ఆదివారం ఆత్మీయ సమ్మేళనం, పాతమిత్రుల కలయిక సభలో తిరుపతి పాణిగ్రాహి మాట్లాడారు. ఆత్మీయ కలయిక సమ్మేళనంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. సన్మాన అతిథులుగా విశ్రాంత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.బి.ఎస్.రామచంద్రరావు, సెంచూరియన్ వర్సిటీ ఉపాధ్యక్షుడు ఆచార్య డి.ఎన్.రావు, జిల్లా పరిషత్తు అధ్యక్షుడు గవర తిరుపతిరావు, వి.యస్.ఎన్.రాజు, అంబటిపూడి లక్ష్మీనర్శింహం, రాంప్రసాద్ (సి.ఏ.), ఉమాచరణ్ పట్నాయక్, ఇందుపల్లి బాబ్జీ విచ్చేశారు. డాక్టర్ సయ్యద్ రహింతుల్లా, తెలగం సీతారాం అతిథి పరిచయం చేశారు. నృత్యాలతో సభికులను ఆనందపరిచారు. సెంచూరియన్ వర్సిటీ ఉపాధ్యక్షుడు ఆచార్య డి.ఎన్.రావు మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో విశ్వవిద్యాలయం అభివృద్ధి, నిరుద్యోగులకు ఉపాధికల్పనకు 200 మందితో ఇన్వెస్టర్స్ మీట్ పెట్టడానికి కృషి చేస్తున్నామని అన్నారు. ఫార్మా, హెల్త్, గార్మెట్, ఫుడ్ టెక్నాలజీ కంపెనీలు ముందుకు వస్తాయన్నారు. ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి మాట్లాడుతూ.. పర్లాకిమిడి జన్మస్థలంలో ఇటువంటి ఆత్మీయ సమ్మేళనం ద్వారా గురువులు, పెద్దల పరిచయం సంతోషం కలిగించిందన్నారు. పర్లాకిమిడికి చెందిన విశ్రాంత సీఎం ప్రధాన కార్యదర్శి సి.బి.ఎస్.రామచంద్రరావు మాట్లాడుతూ, నా తండ్రి పర్లాకిమిడి కృష్ణచంద్ర గజపతి కళాశాలలో 1947లో ఫిజిక్స్ డిపార్ట్మెంట్ హెడ్గా పనిచేశారన్నారు. ఈ కార్యక్రమంలో జామి పోలిశెట్టి, జవ్వాది సూర్యారావు, వి.ఎస్.ఎన్.రాజులు ఆత్మీయ సమ్మేళనానికి సహరికంచారు. స్థానిక కళాకారులు దాండియా, నృత్యాలతో ప్రేక్షకులను అలరించడమే కాకుండా అనేక మంది ప్రముఖులకు మెమొంటోలతో ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి సత్కరించారు.


