
వెలగని దీపం..!
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన దీపం పథకం ఫలితం నీరుగారుతోంది. సుమారు రెండు నెలలైనా దీపం–2 రెండో విడత నగదు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ కాకపోవడంతో అమలుపై అందోళన చెందుతున్నారు. తొలి విడతలో ఈ పథకం ద్వారా అరకొరగా నగదు విడుదల చేసినా, రెండో విడత ప్రారంభం నుంచే ప్రభుత్వం పిల్లిమొగ్గలు వేసిందని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. 2024 నవంబర్లో దీపం–2 పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం 2025 మార్చి 31 వరకు స్కీమును అమలు చేసింది. మొదటి విడత కొంతవరకు నగదును లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరిగింది. తర్వాత రెండో విడత 2025 ఏప్రిల్ నుంచి ప్రారంభమైంది. అయితే ఇప్పటికి రెండు నెలలు గడుస్తున్నా లబ్ధిదారుల ఖాతాల్లో ఒక్క పైసా కూడా జమ కాలేదు. దీంతో లబ్ధిదారులు ప్రతిరోజూ బ్యాంకులు, గ్యాస్ ఏజెన్సీలు, అధికారుల చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నారు.
ఫిర్యాదులు బుట్టదాఖలు
దీపం పథకం ఉచిత సిలిండర్ రాయితీ నగదు అందలేదని చాలా మంది లబ్ధిదారులు పీజీఆర్ఎస్, జిల్లా కలెక్టర్, ఇతర అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. అయితే వారి వద్ద నగదుకి సంబంధించి సమాచారం లేకపోవడం, గ్యాస్ కంపెనీలు తమ వద్ద ప్రభుత్వం నగదు లేదని స్పష్టం చేయడంతో ఫిర్యాదులను అధికారులు బుట్టదాఖలు చేస్తున్నారు.
రోజుకోమాట...
ఉచిత గ్యాస్ పథకంలో రెండో విడత నగదు విడుదలపై కూటమి ప్రభుత్వం కప్పగంతులు వేస్తోంది. రోజుకోమాట చెబుతూ ప్రజలను మభ్యపెడుతోంది. ఒక రోజు అన్ని డబ్బులు త్వరలో వేస్తామని చెబుతున్నారు. మరోసారి ముందుగానే లబ్ధిదారులకు డబ్బులు అందజేస్తాము, వారు ఆ డబ్బులతో సిలిండర్ విడిపించుకోవాలని చెబుతున్నారు. మరోసారి ఈ పథకం నడపడం సాధ్యం కాదని లోలోపల సమాచారం అందిస్తున్నారు. ఇలా ఈ ఉచిత గ్యాస్ పథకంపై ప్రభుత్వం రోజుకోమాట చెబుతోంది. ఈ ఉచిత సిలిండర్ పథకం ద్వారా అందజేసే నగదు జిల్లాలోని సివిల్ సప్లయ్, జాయింట్ కలెక్టర్ కంట్రోల్లో లేకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకుంది. తొలి విడతకు సంబంధించిన నగదు సంబంధిత గ్యాస్ (ఆయిల్) కంపెనీలకు జమ చేసింది. తొలి విడతకు సంబంధించి కొంత నగదు జమ చేయడంతో, ఆయిల్ కంపెనీలు ఆ నగదుని లబ్ధిదారులకు ఖాతాల్లో జమ చేశారు. అయితే రెండో విడతకు వచ్చేసరికి, ఈ నగదుని గ్యాస్ కంపెనీలకు ప్రభుత్వం జమ చేయలేదు. దీంతో లబ్ధిదారులకు సబ్సిడీ నగదు అందేలా కనిపించడం లేదు.
రెండు నెలలైనా అందని దీపం– 2 సబ్సిడీ
రెండో విడత సుమారు రూ.16,81,88,000ల బకాయిలు
నగదు కోసం లబ్ధిదారుల ఎదురుచూపు
ఇదీ విషయం...
జిల్లాలో అన్ని గ్యాస్ కంపెనీలకు సంబంధించి 37 ఏజెన్సీలు ఉన్నాయి. ఽవీటిలో సింగిల్, డబుల్ సిలిండర్ల కనెక్షన్లు అన్ని కలిపి 6,92,825 ఉన్నా యి. వీటిలో ప్రతినెల సుమారుగా 88 వేలుకి పైగా లబ్ధిదారులు గ్యాస్ను విడిపించుకుంటున్నారు. వీరందరికీ ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ అందజేయాల్సింది. మొదటి విడతగా 2024 నవంబర్ ఒకటో తేదీ నుంచి 2025 మార్చి 31 వరకు నిర్ణయించారు. ఈ విడతలో ఐదు నెలలకు గాను జిల్లావ్యాప్తంగా 4,40,278 మంది లబ్ధిదారులు గ్యాస్ బుక్ చేసుకొని విడిపించుకొన్నారు. వీరిలో 4,35,035 కనెక్షన్లకు మాత్రమే నగదు వారి బ్యాంకు ఖాతాల్లో జమయ్యింది. 5,241 మంది లబ్ధిదారులకు రూ.49,78,950లు బకాయిలు వారి బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదు. ఇకపోతే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై నెలాఖరు వరకు రెండో విడత గడువును నిర్ణయించింది. అయితే దీనికి సంబంధించిన నిధులు ఇప్పటివరకూ లబ్ధిదారులకు అందలేదు. రెండో విడతకు సంబంధించి రెండు నెలలు అనగా ఏప్రిల్, మే నెలల్లో జిల్లాలో సుమారుగా 1,77,040 మంది గ్యాస్ను బుక్ చేసుకున్నారు. వారు ఇప్పటికే గ్యాస్ ఏజెన్సీలకు డబ్బులు చెల్లించి గ్యాస్ను పొందారు. అయితే వీరికి గాను ప్రస్తుతం ఉన్న గ్యాస్ సిలెండర్ ధర ప్రాప్తికి సుమారుగా రూ.16,81,88,000లు చెల్లించాల్సింది. అయితే దీనికి అతిగతీ లేకుండా పోయింది.

వెలగని దీపం..!