
బావిలో పడిన ఎలుగు సురక్షితం
భువనేశ్వర్: మయూర్భంజ్ జిల్లా బరిపద అటవీ మండలం కప్తిపడా రేంజ్లోని పాడుబడిన బావిలో ఓ ఎలుగు బంటి పడిపోయింది. బావిలో చిక్కుకున్న ఎలుగుబంటిని తక్షణ స్పందన బృందం (ఆర్ఆర్టీ) సురక్షితంగా రక్షించిందని అధికారులు ప్రకటించారు. బావి నుంచి సురక్షితంగా బయటకు తీసిన ఎలుగుబంటిని బోనులో సురక్షితంగా ఉంచారు. ఎలాంటి హాని జరగలేదని తెలిపారు. శనివారం వేకువ జామున గ్రామం పొలిమేరల్లో ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు గ్రామస్తుల దృష్టికి వచ్చింది. దీనిని వెంబడించే సరికి పాడుబడిన బావిలో ప్రమాదవశాత్తు పడింది. గ్రామస్తుల నుంచి ఈ సమాచారం అందడంతో అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సహాయక చర్యల్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు సమీపంలోని ప్రజలు గుమిగూడారు.
చీఫ్ ఇంజినీర్ బైకుంఠ నాథ్ షడంగి అరెస్టు
భువనేశ్వర్: రాష్ట్ర ఆర్డబ్ల్యూ చీఫ్ ఇంజినీర్ బైకుంఠ నాథ్ షడంగిని ఒడిశా విజిలెన్స్ అరెస్టు చేసింది. అధికారిక ఆదాయానికి మించి అపరిమిత ఆస్తుల ఆర్జన ఆరోపణ కింద నమోదు చేసిన కేసులో అరెస్టు చేసి జైలుకు తరలించారు. అంతకు ముందు చేపట్టిన ఆస్తుల సోదా దాడుల్లో నిందిత బైకుంఠ నాథ్ షడంగి ఆదాయానికి మించి 483 శాతం అధికంగా ఆస్తులు ఆర్జించినట్లు తేలింది. ఈ సోదాల్లో రూ. 2.56 కోట్లకు పైగా నగదు, 2 బహుళ అంతస్తుల భవనాలు, 2 ఫ్లాట్లు, 7 ఇళ్ల స్థలాలు, రూ.1.5 కోట్ల డిపాజిట్లు, రూ. 2.7 కోట్ల షేర్ పెట్టుబడులు, 1.141 కిలోల బంగారం మొదలైనవి బయటపడ్డాయి.
గంజాయి మాఫియాకు
గట్టి షాక్
జయపురం: జయపురం పట్టణ పోలీసులు గంజాయి మాఫియాకు గట్టి షాక్ ఇచ్చారు. గంజాయిని దొంగతనంగా తరలించేందుకు సిద్ధమవుతున్న సమయంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి 1318 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు పట్టణ పోలీసు అధికారి ఉల్లాస్ చంద్ర రౌత్ నేడు వెల్లడించారు. గంజాయితో పాటు 120 బస్తాల తవుడు, నాలుగు మొబైల్ ఫోన్లు సీజ్ చేసినట్లు వెల్లడించారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.1 కోటి 30 లక్షలు ఉంటుందని వెల్లడించారు. ఈ సందర్భంగా ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అరెస్టయిన వారు జయపురం సమితి టంకువ పంచాయతీ బమణగాం దుర్గా బహుదూర్(35), కుసుమగుడ వాసి మీణా బారిక్(35)లు అని వెల్లడించారు. వారిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా బెయిల్ మంజూరు కాకపోవటంతో వారిని జైలుకు తరలించినట్లు వెల్లడించారు. పోలీసు అధికారి వివరణ ప్రకారం.. ఈ నెల 29 వ తేదీన సబ్ఇన్స్పెక్టర్ రాజేంద్ర పంగి, ఏఎస్ఐ రమేష్ చంద్ర మహాపాత్రో తమ సిబ్బందితో పెట్రోలింగ్ జరుపుతున్నారు. స్థానిక హటపొదర్ (సంత తోట) ప్రాంతంలో ఉన్న రెండు షోరూంల మధ్య గల సందులో నుంచి ఇద్దరు వ్యక్తులు పరుగెత్తుకుంటూ వెళ్లడం పోలీసులకు కనిపించింది. అనుమానం వచ్చి వారిని వెంబడించారు. షోరూంల వెనుక ఉన్న ఒక కవాడి దుకాణం(పాత సామానులు కొనే దుకాణం) ముందు దాదాపు 12 మంది నిలుచుని ఉన్నారు. వారు బస్తాలు తీసుకు వస్తూ ఒక ట్రక్కులో లోడు చేస్తున్నారు. వారిలో పట్టణ ప్రాంతంలోను, సదర్ పోలీసు స్టేషన్ పరిధిలో కొంతమంది నేరస్తులు ఉండటం కనిపించింది. వారు పోలీసు అధికారులను, పోలీసు సిబ్బందిని చూసి పారిపోయారు. వారిని పోలీసులు వెంబడించారు. పారిపోతున్న వారిలో ఇద్దరు పోలీసులకు పట్టుబడగా మిగతా వారు పరారయ్యారు. వారిని అరెస్టు చేసి విచారించగా వారు తమతో ఉన్న వారి పేర్లను వెల్లడించారని పోలీసు అధికారి వెల్లడించారు. రెండు ట్రక్కులను తనిఖీ చేయగా అందులో 4 టన్నుల తవుడు ఉండగా వాటి కింద 259 గంజాయి ప్యాకెట్లు బయట పడ్డాయని, వాటిని మెజిస్ట్రేట్ సమక్షంలో తూయించగా అవి 1318 కిలోలు ఉన్నట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.

బావిలో పడిన ఎలుగు సురక్షితం

బావిలో పడిన ఎలుగు సురక్షితం