
త్రుటిలో తప్పిన ప్రమాదం
టెక్కలి: కోటబొమ్మాళి మండలం కొత్తపేట పంచాయతీ కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీలో త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు కాలనీలో కొండకు ఆనుకుని ఉన్న నీలాపు రామకృష్ణకు చెందిన ఇంట్లోకి మంగళవారం రాత్రి సమయంలో కొండమీద నుంచి వరదనీటితో పాటు కంకర ఒక్కసారిగా పడిపోవడంతో కుటుంబ సభ్యులు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. ఇదే కాలనీలో నివాసముంటున్న వైస్ ఎంపీపీ దుక్క రోజారాణి ఇంటి వద్దకు వెళ్లి జరిగిన ఘటన వివరించారు. దీంతో రోజారాణితో పాటు ఆమె భర్త రామకృష్ణారెడ్డి వారి ఇంటి వద్దకు వెళ్లి పరిశీలించారు. అనంతరం బుధవారం ఉదయం పంచాయతీరాజ్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో డీఈ సుధాకర్తో పాటు ఇతర అధికారులు ఇందిరమ్మ కాలనీ వద్దకు చేరుకుని మట్టిని తొలగించే చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా ఇందిరమ్మ కాలనీలో నివాసాలకు ఆనుకుని కొండమీద అభివృద్ధి పేరుతో రోడ్డు పనులు చేస్తున్నారు. అయితే ముందస్తుగా అధికారులు సరైన ప్రణాళిక చేపట్టకపోవడంతో ఇటువంటి సంఘటన జరిగినట్లు కాలనీవాసులు చెబుతున్నారు. కొండపైకి రోడ్డు కోసం ఇప్పటికే రెండు ప్రాంతాల్లో పనులు ప్రారంభించారని, ఇప్పుడు ఇళ్లకు ఆనుకుని కొత్తగా రోడ్డు పనులు చేస్తున్నారని పేర్కొన్నారు. కాలనీవాసులు నివసిస్తున్న ఇళ్లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రక్షణ గోడ నిర్మాణం చేపట్టి తదుపరి పనులు చేయాలని కోరుతున్నారు.