
నీలినీడలు!
సరస్వతీ పుష్కరాలపై
● ఉత్తరాఖండ్లో మే 15 నుంచి ప్రారంభం కానున్న పుష్కరాలు
● భారత్–పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో భయాందోళనలో భక్తులు
● ఇప్పటికే తరలివెళ్లి
బిక్కుబిక్కుమంటున్న కొరాపుట్ జిల్లాల ప్రయాణికులు
కొరాపుట్: భారత్–పాక్ మధ్య ఉద్రిక్తత వాతావరణం ప్రభావం సరస్వతీ పుష్కరాలపై పడింది. రోజురోజుకూ దాడులు పెరుగుతున్న నేపథ్యంలో పుష్కరాల నిర్వహణపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. సరస్వతి నది పుష్కరాలు మే 15 నుంచి 26వ తేదీ వరకు జరగాల్సి ఉంది. సరస్వతి నది ఉత్తర్ఖాండ్ రాష్ట్రంలో బద్రీనాద్ థామ్కు సమీపంలో మన అనే గ్రామంలో కనిపించి కొంత దూరంలో అంతర్లీనంగా భూమిలోనికి వెళ్లిపోతుంది. మరలా ఉత్తర్ప్రదేశ్లో ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగంలో అంతర్వాహినిగా గుర్తిస్తారు. ఈ మన గ్రామాన్ని దేశంలో చివరి గ్రామంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీని తర్వాత టిబెట్ వస్తుంది. ప్రయాగ్రాజ్ గానీ, మన గ్రామానికి గానీ పర్యాటకు వెళ్తుంటారు. పనిలోపనిగా హిమాలయాలలో 6 నెలలు మాత్రమే తెరిచే ఉండే బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యయునోత్రిలను దర్శించుకుంటారు.
విపరీతమైన రద్దీ..
ఎక్కువగా తెలుగు ప్రజలు మాత్రమే వెళ్లే ఈ పుష్కరాలలో విపరీతమైన రద్దీ ఏర్పడుతుంది. ఇప్పటికే దేశంలో అనేక ట్రావెల్ ఏజెన్సీల నిర్వాహకులు భారీ ప్యాకేజీలతో లక్షలాది మంది చేత టిక్కెట్లు కొనిపించారు. ఇప్పటికే వేలాది మంది హిమాలయాలకు చేరుకున్నారు.
యుద్ధ భయం..
ప్రస్తుతం ఎక్కడ చూసినా యుద్ధ భయమే కనిపిస్తోంది. ఇప్పటికే దాదాపు 10 రాష్ట్రాలను కేంద్రం అలర్ట్ చేసింది. వందల సంఖ్యలో విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఈ పుష్కరాలు కోసం వెవెళ్లి వచ్చేవారు అత్యధికంగా న్యూఢిల్లీ మీదుగా విమాన ప్రయాణాలు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో కూడా యుద్ధ భయం ఏర్పడింది. విమాన సర్వీసులు రద్దయితే చిక్కుకుంటామని భయపడుతున్నారు. యుద్ధ ఆంక్షలు పెరిగితే తిరిగి ఇంటికి ఎలా రావాలో తెలియక తెలుగు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భయం.. అభయం..
ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఎక్కువ మంది తమ బద్రీనాథ్ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్నారు. ఇప్పటికే హరిద్వార్ దాటిన వారు మాత్రం ఏం జరిగితే అదే జరుగుతుందంటూ ముందుకు వెళ్తున్నారు. మరో వైపు ట్రావెల్ ఆపరేటర్లు మాత్రం ప్రయాణికులకు గట్టి భరోసా ఇస్తున్నారు. యుద్ధ ప్రభావం ఉత్తరాఖండ్పై పడదని నచ్చజెప్పుతున్నారు. ప్రతి ఒక్కరిని తాము ఇంటికి భద్రంగా చేరుస్తామని ధైర్యం ఇస్తున్నారు.
అవిభక్త కొరాపుట్ జిల్లాల్లో..
అవిభక్త కొరాపుట్ జిల్లాలైన కొరాపుట్, రాయగడ, నబరంగ్పూర్, మల్కన్గిరి నుంచి సుమారు 10 వేల మంది సరస్వతి పుష్కరాల ప్రయాణాలు పెట్టుకున్నారు. ఇప్పటికే వందలాది మంది హరిద్వార్ దాటి హిమాలయాల దరికి చేరుకున్నారు. మిగిలిన వారు సందిగ్ధంలో పడ్డారు.