
విమాన సేవలు రద్దు
భువనేశ్వర్: జాతీయ భద్రతా వైమానిక సరిహద్దుల కారణంగా స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన సేవలు ప్రభావితం అయ్యాయి. గురువారం ఇక్కడ నుంచి బయల్దేరాల్సిన 2 విమాన సేవలు రద్దు చేశారు. ప్రభావితమైన 2 విమానాల్లో హిండన్ (ఘజియాబాద్)కు వెళ్లే విమానం, పాట్నా నుంచి భువనేశ్వర్ మీదుగా చండీగఢ్కు వెళ్లే విమానం ఉందని డైరెక్టర్ ప్రసన్న ప్రధాన్ తెలిపారు. భువనేశ్వర్ నుంచి ఘజియాబాద్ హిండన్కు వెళ్లే విమానం ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రద్దు చేయబడింది. సాంకేతిక లోపాల కారణంగా పాట్నాకు వెళ్లే మరో విమానాన్ని తాత్కాలికంగా వరుసగా రెండో రోజు రద్దు చేశారని వివరించారు. ఇతర విమానాలు మరియు కార్యకలాపాలు సాధారణంగా పనిచేస్తున్నాయి. భయపడాల్సిన అవసరం లేదని విమానాశ్రయ డైరెక్టర్ తెలిపారు.
ఇసుక ట్రాక్టర్లు నడిపేందుకు అనుమతివ్వండి
రాయగడ: పగటిపూట ఇసుక ట్రాక్టర్లను నడిపేందుకు అనుమతినివ్వాలని కోరుతూ స్థానిక మా మజ్జిగౌరి ట్రాక్టర్ యజమానుల సంఘం జిల్లా యంత్రాంగానికి కోరింది. ఈ మేరకు డిప్యూటీ కలెక్టర్కు సంఘం సభ్యులు వినతిపత్రం గురువారం అందజేశారు. రాత్రి వేళల్లో ఇసుక ట్రాక్టర్లు, భారీ వాహనాల రాకపోకలు కొనసాగుతుండడంతో ట్రాక్టర్లకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. ఎదురుగా వచ్చే భారీ వాహనాల లైట్ల వలన ఒక్కోసారి చిన్నపాటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు పద్మనాభ దాస్ తదితరులు పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో ఏకాదశి పూజలు
రాయగడ: స్థానిక బాలాజీ నగర్లోని కల్యాణ వేంకటేశ్వర ఆలయంలో వైశాఖ మాస ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు భాస్కరాచార్యుల ఆధ్వర్యంలో ఉదయం స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలతో పాటు శ్రీరమా సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ, ప్రసాదాలను స్వీకరించారు.
అమిత్ షా ఒడిశా పర్యటన వాయిదా
భువనేశ్వర్: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటన వాయిదా పడింది. బీజేపీ ఎమ్మెల్యే జయ నారాయణ మిశ్రా ఈ విషయం వెల్లడించారు. లోగడ ప్రకటించిన కార్యక్రమం ప్రకారం ఈ నెల 10వ తేదీన అమిత్ షా రాష్ట్రంలో రెండు రోజులు పర్యటించాల్సి ఉంది. భారత్, పాకిస్తాన్ ఉద్రిక్త పరిస్థితుల కారణంగా పర్యటన వాయిదా పడింది.
అబుదాబికి విమాన సేవలు
భువనేశ్వర్: భువనేశ్వర్ నుంచి అబుదాబికి ప్రత్యక్ష విమానయాన సౌకర్యం అందుబాటులోకి రానుంది. కొత్త గమ్యస్థాన విధానం (న్యూ డెస్టినేషన్ పాలసీ) కింద భారత ప్రభుత్వం ఈ సౌకర్యం కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి తెలిపారు. ఈ సౌకర్యం ఈ ఏడాది జూన్ నెల నుంచి ప్రారంభం కానుందని ప్రకటించారు. వారానికి 3 రోజులు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. మంగళ, గురు, శనివారాల్లో భువనేశ్వర్, అబుదాబి మధ్య విమానయాన సౌకర్యం ఉంటుంది.

విమాన సేవలు రద్దు