
15 కిలోల గంజాయి స్వాధీనం
● ఇద్దరు అరెస్టు
పర్లాకిమిడి: గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 15 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. గజపతి జిల్లాలోని మోహనా బ్లాక్ అడవ పోలీసుస్టేషన్ పరిధి హాడపోదా జంక్షన్ వద్ద ఇద్దరు వ్యక్తులు గంజాయిని అక్రమంగా తరలిస్తున్నారని అందుకున్న సమాచారం మేరకు దాడులు చేశామన్నారు. గంజాయి తరలిస్తున్న నిందితులు అడవ గ్రామానికి చెందిన రఘునాథ శెఠి, అజయ్ నాయక్లుగా గుర్తించామన్నారు.
21 ద్విచక్ర వాహనాలు స్వాధీనం!
జయపురం: బైక్ దొంగల ఆట కట్టించేందుకు జయపురం పట్టణ పోలీసులు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా చోరీకి పాల్పడుతున్న వారిని గుర్తించి వారివద్ద నుంచి 21 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. కొంతమందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు సమాచారం. కాగా ఈ విషయాన్ని పట్టణ పోలీసు అధికారి వల్లభ చంధ్ర రౌత్ వద్ద ప్రస్తావించగా సమాదానం చెప్పేందుకు నిరాకరించారు. అయితే తగిన సమయంలో పూర్తి వివరాలు వెల్లడిస్తామంటున్నారు.
గాయపడిన వ్యక్తి మృతి
నరసన్నపేట: మండలంలోని ఉర్లాం రైల్వేస్టేషన్ వద్ద పట్టాలు దాటుతుండగా ఫలక్నుమా ఎక్స్ప్రెస్ ఢీకొని గాయపడిన తుంగాన గోవిందరావు (48) గురువారం వేకువజామున మృతి చెందారు. బుధవారం ఉదయం ట్రైన్ ఢీకొనడంతో గాయాలపాలై న విషయం తెలిసిందే. శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు జీఆర్పీ హెచ్సీ మధుసూదనరావు తెలిపా రు. కాగా మృతునికి భార్య అప్పలనర్సమ్మ, కుమారుడు మహేష్, కుమార్తె అనితలు ఉన్నారు.
కానిస్టేబుల్పై కేసు నమోదు
కాశీబుగ్గ: పలాస కోర్టుకు సంబంధించి వివిధ కేసుల్లో రికవరీ అయిన బంగారం, నగదును సొంతానికి వాడుకున్న విషయమై ఒక కానిస్టేబుల్పై కాశీబుగ్గ పోలీసుస్టేషన్లో గురువారం కేసు నమోదయ్యింది. సంబంధిత బాధితులకు అందాల్సిన రూ.10 లక్షలు, ఆరు తులాల బంగారం అందకపోవడంతో వారు కోర్టును ఆశ్రయించగా విషయం బయటపడింది. ఇదే విషయంపై కాశీబుగ్గ పోలీసుస్టేషన్ సీఐ సూర్యనారాయణకు వివరణ కోరగా, అతనిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

15 కిలోల గంజాయి స్వాధీనం