
మే 20 నుంచి రబీ ధాన్యం సేకరణ
రాయగడ: రబీ సీజన్లో పండించిన ధాన్యాన్ని జిల్లా యంత్రాంగం మే 20 నుంచి సేకరిస్తుందని కలెక్టర్ ఫరూల్ పట్వారి అన్నారు. స్థానిక డీఆర్డీఏ సమావేశం హాల్లో జరిగిన సమీక్షసమావేశంలో ఆమె ప్రసంగించారు. ఈ ఏడాది జిల్లాలో 8,890 క్వింటాళ్ల ధాన్యం సేకరణకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అందుకోసం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మండీలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారుల పర్యవేక్షణతో పాటు బజారు నియంత్రణ కమిటీ (ఆర్ఎంసి) అధికారులు మండీల ఏర్పాటుకు సంబంధించి అన్ని సన్నాహాలు చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రతి రైతు నుంచి ధాన్యం సేకరించాలని ధాన్యం సేకరణలో భాగంగా ఏర్పాటు చేసిన మండీల్లొ రైతులు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొనకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బిష్ణు ప్రసాద్ కర్ మాట్లాడుతూ ఈ రబీ సీజన్లో ధాన్యం విక్రయాలకు సంబంధించి ఇప్పటి వరకు 503 మంది రైతులు తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు వివరించారు. ధాన్యం క్వింటాల్ ఽమద్దతు ధర రూ.2300 ప్రభుత్వం ప్రకటించగా ఇన్పుట్ సహాయం కింద రైతులు ప్రతి క్వింటాల్కు అదనంగా మరో రూ.800 పొందగలరని అన్నారు. జిల్లాలోని బిసంకటక్, మునిగుడ, గుడారి, పద్మపూర్ ,రామనగుడ, కొలనార సమితుల్లో మే 20 నుంచి ధాన్యం మండీలు ప్రారంభమవ్వగా గుణుపూర్లో మే 28 నుంచి ప్రారంభమవుతాయని అన్నారు. ఈ సమావేశంలొ రాయగడ ఎమ్మెల్యే అప్పల స్వామి కడ్రక, కొరాపుట్ ఎంపీ సప్తగిరి శంకర్ ఉల్క, బిసంకటక్ ఎమ్మెల్యే నీలమాధవ హికక జిల్లా స్థాయి ఉద్యోగులు పాల్గొన్నారు.