పామర్రు మాజీ ఎమ్మెల్యే అనిల్కుమార్ను అడ్డుకున్న పోలీసులు గంట సేపటికి పైగా రోడ్డుపైనే నిలువరించిన వైనం బీజేఆర్ విగ్రహానికి పూలమాలలు వేయకుండా నిర్బంధం ఆగకపోతే కేసులు పెడతామని హెచ్చరిక
పామర్రు: ‘ఎమ్మెల్యే వస్తున్నారు. మీరు దండ వేసేందుకు వీల్లేదు. ఇక్కడే ఉండండి’ అంటూ వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ను కృష్ణా జిల్లా పమిడిముక్కల పోలీసులు అడ్డుకున్నారు. గంట సేపటికి పైగా రోడ్డు పైనే నిలువు కాళ్లపై వేచి ఉండేలా నిర్బంధించారు. ప్రజాస్వామ్య దేశంలో దళిత నేత బీజేఆర్ విగ్రహానికి నివాళులర్పించాలన్నా పోలీసుల అనుమతి కావాలా? చంద్రబాబు ప్రభుత్వ రాక్షస పాలనకు ఇది నిదర్శనమని స్థానికులు వాపోయారు. బాబూ జగ్జీవన్రామ్ జయంతిని పురస్కరించుకుని పామర్రులో మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్కుమార్ ఆదివారం పర్యటనలు చేస్తూ బీజేఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ నేపథ్యంలో అనిల్కుమార్ పమిడిముక్కల గ్రామం చేరుకున్నారు. అక్కడ జగ్జీవన్రామ్ విగ్రహానికి పూలదండ వేయకుండా పమిడిముక్కల సీఐ చిట్టిబాబు ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకున్నారు. ‘ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పమిడిముక్కల వస్తున్నారు. ఆయన వెళ్లే వరకు మీరు గ్రామంలోకి రావడానికి వీల్లేదు’ అని హెచ్చరించారు.
మాట వినకపోతే కేసులు బనాయిస్తాం
తమ మాట వినకపోతే కేసులు బనాయిస్తామని హెచ్చరించారు. అంతేకాదు కై లే కార్లను ముందుకు వెళ్లకుండా పోలీసులు నిర్బంధించారు. సుమారు గంటకు పైగా రోడ్డుపైన మాజీ ఎమ్మెల్యే అనిల్కుమార్, వైఎస్సార్ సీపీ నాయకులు వేచి ఉన్నారు. ఈ విషయమై కై లే మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య దేశంలో ఎమ్మెల్యే వస్తుంటే సామాన్యులు పనులు చేసుకునే అవకాశం లేదా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంలో పోలీసులు కావాలని రెచ్చగొట్టే ధోరణిలో ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. తాము దండ వేసి వెళ్లిపోతామని చెప్పినా పోలీసులు అంగీకరించలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, ఆయన వర్గీయులు బీజేఆర్ విగ్రహానికి పూలమాలలు వేళ్తూ వైఎస్సార్ సీపీ శ్రేణులను రెచ్చగొట్టేలా కార్లను వారి కార్లపై వేగంగా పోనించారు. టీడీపీ కార్యకర్తలు ఇలా ప్రవర్తించినా అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకోకుండా చోద్యం చూశారు. పోలీసుల తీరుపై గ్రామస్తులు విస్మయం వ్యక్తంచేశారు.


