
భూ సేకరణ పడక..
గ్రీన్ ఫీల్డ్ హైవేకు భూసేకరణే అడ్డంకి
గడ్డమణుగు గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 173/3లో ఇద్దరు రైతుల నుంచి 48 సెంట్ల భూమిని హైవే కోసం తీసుకున్నారు. ఆ రైతులు అందుబాటులో లేరు. ఈ భూమిని నేను కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాను. నష్ట పరిహారం కోసం అవసరమైన పత్రాలన్నీ నేనే అధికారులకు ఇచ్చాను. అయినప్పటికీ పరిహారం ఇవ్వకుండా నేను సాగు చేస్తున్న పత్తి, మునగ పైర్లును అన్యాయంగా దున్నేశారు. నాకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వమే చెల్లించాలి.
– అజ్మీరా హేమానాయక్, రైతు,
గడ్డమణుగు, జి.కొండూరు మండలం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ – ఖమ్మం గ్రీన్ ఫీల్డ్ హైవే ప్యాకేజీ–3 పనులు నత్తనడకన సాగుతున్నాయి. భూసేకరణే ఈ పనులకు ప్రధాన అడ్డంకిగా మారింది. బాధిత రైతులకు పరిహారంగా ఇచ్చేందుకు నిధులు మంజూరైనా పంపిణీలో తీవ్ర జాప్యం నెలకొంది. భూ సేకరణ జాప్యం కావడంతో పనులు ఆలస్యంగా జరుగుతున్నాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో భూ సేకరణపై ప్రత్యేక దృష్టి సారించి పరుగులు పెట్టించారు. అప్పట్లో జాయింట్ కలెక్టర్ సంబంధిత గ్రామాల రైతులతో చర్చించి భూ సేకరణను తుది దశకు తెచ్చారు. కూటమి అధికారంలో వచ్చాక భూసేకరణ పనులు అటకెక్కాయి. దాదాపు ఏడాదిన్నరగా భూసేకరణ పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారాయి. దీంతో రహదారి పనులు ప్రారంభించ డంలో తీవ్ర జాప్యం జరిగింది. ఇప్పటికీ పలు చోట్ల భూసేకరణ పనులు పెండింగ్లోనే ఉన్నాయి.
14 గ్రామాల్లో 351 ఎకరాలు
విజయవాడ – నాగపూర్ ఎకనామిక్ కారిడార్లో అంతర్భాగంగా విజయవాడ – ఖమ్మం మధ్య ప్యాకేజీ–3కి సంబంధించి 29.70 కిలో మీటర్ల మేర రహదారి పనులు చేపట్టాల్సి ఉంది. ఈ రహదారి కోసం ఎన్టీఆర్ జిల్లాలో గంపలగూడెం, జి.కొండూరు, విజయవాడ రూరల్ మండలాల పరిధిలోని 14 గ్రామాల్లో 351 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ఇప్పటి వరకు కేవలం 136 ఎకరాల భూమి సేకరించారు. ఇంకా 215 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ప్రధానంగా రహదారి వెంబడి 22.5 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. 3డీ నోటిఫికేషన్ స్థాయిలో మరో 30 ఎకరాలు ఉంది. ఈ భూములకు సంబంధించిన సమస్య ఇంకా కొలిక్కి రాలేదు. దీనికితోడు భూసేకరణలో భూమికి సంబంధించి మార్కెట్ విలువల్లో వ్యత్యాసాలు ఉన్నాయనే ఆరోపణలున్నాయి. ఏడాదిన్నర క్రితమే రూ.220 కోట్ల మేర అవార్డులు పాసైనా ఇప్పటి వరకు కేవలం రూ.65 కోట్లు మాత్రమే భూములు కోల్పోతున్న రైతులకు పంపిణీ చేశారు. డాక్యుమెంట్లు సమర్పించలేదని, ఇతర చిన్న చిన్న కారణాలతో పరిహారం పంపిణీ నిలిచిపోయింది. క్షేత్ర స్థాయిలో కొంత మంది రెవెన్యూ అధికారులు డబ్బులకు ఆశపడి, భూములు కోల్పోతున్న రైతులను పరిహారం పంపిణీ విషయంలో ఇబ్బంది పెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. మొత్తం మీద భూసేకరణకు నిధుల సమస్య లేకున్నా రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యమే జాతీయ రహదారి పనుల ప్రారంభంలో జాప్యానికి కారణమని స్పష్టంగా కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం ఈ భూసేకరణ పనులపైన దృష్టి సారించకపోవడంతోనే ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
అన్యాయంగా పైరు దున్నేశారు
ఎన్టీఆర్ జిల్లాలో ప్యాకేజీ–3 కింద 29.70 కి.మీ. మేర జాతీయ రహదారి ఏడాదిన్నర క్రితమే రూ.230 కోట్ల అవార్డు పాసైనా బాధిత రైతులకుపంపిణీ చేసింది రూ.65 కోట్లే నత్త నడకన సాగుతున్న భూ సేకరణ పనులు కొలిక్కి రాని అసైన్డ్ భూముల వ్యవహారం
గ్రీన్ ఫీల్డ్ హైవే ఇలా..
పరిహారం ఇవ్వకుండానే రహదారి పనులు
మా అత్తగారు చొక్కం వెంకట్రావమ్మ పేరుతో సర్వే నంబరు 12–3లో గల 1.90 ఎకరాల్లో 60 సెంట్లు భూమిని గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం తీసుకున్నారు. అయితే ఈ భూమి రికార్డుల్లో చాకలి ఇనామ్గా నమోదైందని పరిహారం ఇవ్వడం లేదు. 40 సంవత్సరాలుగా ఈ భూమిని మేము సాగు చేసుకుంటున్నాం. ఈ భూమికి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, పాసుపుస్తకాలు కూడా ఉన్నాయి. అధికారులు వెంటనే స్పందించి పరిహారం అందించాలి.
– కొండపల్లి సత్యనారాయణ,
చెర్వుమాధవరం, జి.కొండూరు మండలం
విజయవాడ – నాగపూర్ ఎకనామిక్ కారిడార్ (జాతీయ రహదారి) పనులను పనులను గత నెల ఏడో తేదీన ప్రారభించారు. 80 శాతం భూమి అప్పగిస్తేగానీ పనులు ప్రారంభం కావు. భూసేకరణలో జరుగుతున్న జాప్యంతో 60 శాతం భూమిని మాత్రమే అధికారులు అప్పగించారు. దీంతో జి.కొండూరు మండలంలో కాంట్రాక్టు సంస్థ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించింది. ప్రస్తుతం కంపచెట్లు తొలగింపు, భూమి చదును చేయడం వంటి పనులు జరుగుతున్నాయి. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.745.83 కోట్లు. మెగా కాంట్రాక్టు సంస్థ ఈ పనులకు మే 23, 2023లో అగ్రిమెంట్ చేసుకొంది. ఈ పనులను ప్రారంభించిన రెండేళ్లలోపు పూర్తి చేయాల్సి ఉంది. 29.707 కిలోమీటర్ల రహదారిలో 1.345 కిలోమీటర్ల స్లిప్ రహదారి ఉంది. మేజర్ బ్రిడ్జి ఒకటి, మైనర్ బ్రిడ్జిలు 19, వీయూపీఎస్లు ఆరు, ఎల్వీయూపీఎస్లు ఐదు నిర్మించాల్సి ఉంది.

భూ సేకరణ పడక..

భూ సేకరణ పడక..

భూ సేకరణ పడక..

భూ సేకరణ పడక..