
రైతుల గోడు పట్టని కూటమి ప్రభుత్వం
పెనుగంచిప్రోలు: కూటమి ప్రభుత్వానికి రైతుల గోడు పట్టడం లేదని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ విమర్శించారు. మునేరు వరదల సమయంలో తువ్వకాలువకు పడిన గండ్లను నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు, జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి తన్నీరు నాగేశ్వరరావుతో కలిసి ఆయన పరిశీలించారు. ముందుగా స్థానిక చెరువుకట్ట వద్ద నుంచి భారీ ర్యాలీగా కాలువ వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ.. తువ్వకాలువకు పడిన గండ్లను వెంటనే పూడ్చాలని డిమాండ్ చేశారు. గత ఏడాది సెప్టెంబర్లో మునేరుకు భారీగా వరదలు వచ్చి తువ్వకాలువకు 50 చోట్ల గండ్లు పడగా, వాటిని పూడ్చడంపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టలేదన్నారు. గండ్లు పూడ్చటానికి అంచనాలు రూపొందించామని అధికారులు, నాయకులు చెబుతున్నా నేటి వరకు ఒక్క రూపాయి కూడా మంజూరు కాలేదన్నారు. వరదల కారణంగా ఖరీఫ్తోపాటు రబీ పంటలను కూడా రైతులు నష్టపోయారని ఆందోళన వ్యక్తంచేశారు. గండ్లను పూడ్చకుంటే ప్రస్తుత ఖరీఫ్లో పంటల సాగు సాధ్యం కాదన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో వరదలకు తువ్వకాలువకు గండ్లు పడితే వెంటనే పూడ్చి రైతులను ఆదుకున్నామని గుర్తుచేశారు. రైతుల తరఫున వైఎస్సార్ సీపీ ఇప్పటికే పలుమార్లు ఆందోళన చేసినా ప్రభుత్వంలో చలనం లేదని విమర్శించారు. గిట్టుబాటు ధర కోసం రైతులు రోడ్డెక్కుతున్నా ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదన్నారు. రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారని వివరించారు. రైతు వ్యతిరేక ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పటానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వేల్పుల రవికుమార్, ఎంపీపీల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు మార్కపూడి గాంధీ, రాష్ట్ర కార్యదర్శి ఇంటూరి రాజగోపాల్(చిన్నా), బీసీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల రామారావు, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు ఏలూరి శివాజీ, పార్టీనాయకులు కొత్తపల్లి పెంటయ్య, పొన్నం కోటేశ్వరరావు, బూడిద నరసింహారావు, నర్రమనేని వెంకటేష్, దేరంగుల శ్రీనివాసరావు, కీసర లోకేశ్వరరావు, మెండెం రామారావు, కనగాల రమేష్, నంబూరి రవి, కనకపూడి భాస్కరరావు, చేని రాంబాబు, సర్పంచ్ బి.జ్యోతిబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.
తువ్వకాలువ గండ్లను వెంటనే పూడ్చాలి వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్