
వీఎంసీ కౌన్సిల్లో టీడీపీ దాష్టీకం
ప్రధానాంశాలు ఇవీ..
పటమట(విజయవాడతూర్పు): విజయవాడ నగరాభివృద్ధిపై చర్చించేందుకు నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో టీడీపీ కార్పొరేటర్లు రెచ్చిపోయారు. అరుపులు, కేకలు, బెదిరింపులతో అలజడి సృష్టించారు. దీంతో సభలో సుమారు గంటపాటు గందరగోళ వాతావరణం నెలకొంది. మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో కౌన్సిల్ సాధారణ సమావేశం మంగళవారం జరిగింది. 156 అంశాలను అజెండాలో పొందుపరచగా మూడు అంశాలను కౌన్సిల్ తిరస్కరించింది. మరో రెండు అంశాలను ఆఫీస్ రిమార్కులకు పంపింది. మొత్తం 149 అంశాలను ఆమోదిస్తూ తీర్మానం చేసి, ఒక అంశాన్ని ధ్రువపరచగా మరో అంశాన్ని రికార్డు చేసింది.
రాద్ధాంతం చేసిన టీడీపీ కార్పొరేటర్లు
ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ (ఐలా) పరిధిలోని ఏపీఐఐసీ కాలనీలో ఉన్న జవహర్ ఆటోనగర్ మ్యూచువల్ ఎయిడెడ్ కో–ఆపరేటివ్ స్టోర్స్ (జమాక్) గృహ సముదాయానికి నగర పాలక సంస్థ నుంచి తాగునీరు సరఫరా చేయాలని వచ్చిన ప్రతిపాదనపై చర్చిస్తుండగా టీడీపీ సభ్యులు రాద్ధాంతం చేశారు. ఐలా కూడా స్థానిక సంస్థేనని, ఆ సంస్థ సమస్యలను వారే పరిష్కరించుకోవాలని వైఎస్సార్ సీపీ సభ్యులు సూచించారు. 2014 నుంచి 19 వరకు టీడీపీ పాలనలో సైతం వీఎంసీ నీటిని ఇవ్వలేదని గుర్తుచేశారు. ఐలా నుంచి బకాయిలు రావాలని సభ్యులు చర్చిస్తుండగా టీడీపీ సభ్యులు గందరగోళం సృష్టించారు. ఓ క్రమంలో మేయర్ పోడియం వద్దకు వచ్చి మరీ కౌన్సిల్కు వ్యతిరేకంగా పార్టీల ప్రస్తావన తీసుకొచ్చారు. సెక్షన్ 89 ప్రకారం మేయర్ ఆదేశాలను ధిక్కరించినందుకు, సభను సజావుగా నిర్వహించేందుకు టీడీపీ సభ్యులు ముమ్మనేని ప్రసాద్, చెన్నుపాటి ఉషారాణిని సస్పెండ్ చేస్తునట్లు మేయర్ భాగ్యలక్ష్మి ప్రకటించారు. వారిని సభ నుంచి వెళ్లాలని సూచించారు. వారు వెళ్లకపోవడంతో మార్షల్స్ను పిలిపించారు. అయితే మార్షల్స్పై టీడీపీ సభ్యులు బెదిరింపులకు దిగారు. ఉద్యోగాలు ఊడతాయని, తమ ప్రభుత్వంలో విధులు ఎలా నిర్వర్తిస్తారో చూస్తామని బెదిరించారు. జమాక్ గృహ సముదాయానికి వీఎంసీ తాగునీరు సరఫరా చేయాలన్న అంశాన్ని తిరస్కరిస్తూ కౌన్సిల్ తీర్మానించింది.
అరుపులు.. కేకలు.. బెదిరింపులతో గందరగోళం సృష్టించిన టీడీపీ కార్పొరేటర్లు ఏపీఐఐసీ కాలనీలోని జమాక్ గృహ సముదాయానికి తాగునీటి సరఫరాపై వివాదం ఐలా పరిధిలోని అంశాన్ని ఆ లోకల్ బాడీనే పరిష్కరించుకోవాలని కౌన్సిల్ సూచన కౌన్సిల్కు ఆటంకం కలిగించిన చెన్నుపాటి ఉషారాణి, ముమ్మినేని ప్రసాద్ సస్పెన్షన్ వారిని బయటకు తీసుకెళ్లేందుకు వచ్చిన మార్షల్స్పై బెదిరింపులకు దిగిన టీడీపీ కార్పొరేటర్లు
జేఎన్ఎన్యూఆర్ఎం ద్వారా నగరంలోని వివిధ ప్రాంతాల్లో నిర్మించిన గృహ సముదాయాల్లో 2,053 గృహాలు ఇప్పటికీ ఖాళీగా ఉన్నాయని, లబ్ధిదారులకు పంపిణీ చేయలేదని ప్రశ్నోత్తరాల్లో సభ్యులు ప్రస్తావించారు. దీనిపై అధికారులు సమాధానమిస్తూ.. ఇప్పటి వరకు 803 మంది లబ్ధిదారులను గుర్తించామని, కొంతమంది లబ్ధిదారులకు పేర్లు, అడ్రస్లు, ఫోన్ నంబర్లు సక్రమంగా లేకపోవడంతో అర్హుల జాబితాలో సీనియారిటీలో ఉన్న వారికి కేటాయింపులు చేస్తామని తెలిపారు.
నగరంలోని అన్ని ప్రాంతాల్లో డ్రెయినేజీ సమస్య తీవ్రంగా ఉందని, దీనిపై ఏ చర్యలు తీసుకుంటారని సభ్యులు ప్రశ్నించారు. దీనిపై డీపీఆర్ (డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు) రూపొందించి రెండు–మూడు రోజుల్లో కన్సల్టెన్సీకి అప్పగించి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటా మని అధికారులు బదులిచ్చారు.
వీఎంసీలో అధికారుల కొరత వేధిస్తోందని, సీఎంఓహెచ్, ఎస్టేట్స్ అధికారి, కింది స్థాయిలో ఇంజినీరింగ్ విభాగంలో ఏఈలు, ఇతర అధికారులు లేకపోవడంతో అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు సక్రమంగా చేరడం లేదని, ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్న ప్రతిపాదనకు సభ్యులు ఆమోదం తెలిపారు.
నగరంలోని అన్ని ప్రాంతాల్లో మరింతగా గ్రీనరీ అభివృద్ధి చేయాలని, సెంట్రల్ డివైడర్లు, పార్కులు, కామన్ సైట్లలో గ్రీనరీ పెంపొందించాలని వచ్చిన అంశం ఆమోదం పొందింది.
ఇటీవల వీఎంసీ కార్పొరేటర్లు దక్షిణ భారత విజ్ఞాన యాత్రలో భాగంగా కేరళలో పర్యటించారు. అక్కడి మాదిరిగా నగరంలోనూ మల్టీస్టోర్డ్ పార్కింగ్ ఏర్పాటు చేయడం ద్వారా ట్రాఫిక్ సమస్యను అధిగమించొచ్చని డెప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజరెడ్డి చేసిన ప్రతిపాదనకు సభ్యులు ఆమోదం తెలిపారు. ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో మల్టీ స్టోర్డ్ కాంప్లెక్స్ నిర్మించాలని తీర్మానం చేశారు.

వీఎంసీ కౌన్సిల్లో టీడీపీ దాష్టీకం