
ప్రజా భాగస్వామ్యంతోనే సమర్థ విపత్తు నిర్వహణ
ప్రత్యేక సమావేశంలో ఎన్డీఎంఏ అధికారుల బృందం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విస్తృత ప్రజా భాగస్వామ్యంతోనే సమర్థ విపత్తు నిర్వహణ సాధ్యమని జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ(ఎన్డీఎంఏ) సీనియర్ అధికారుల బృందం పేర్కొంది. ఎన్డీఎంఏ జాయింట్ అడ్వైజర్ ఎన్.ప్రకాష్, అండర్ సెక్రటరీ అభిషేక్ బిశ్వాస్, సీనియర్ కన్సల్టెంట్ అభినవ్ వాలియా సోమవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ వీసీ హాల్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొని జిల్లా విపత్తు నిర్వహణ ప్రణాళిక నవీకరణ, డిజాస్టర్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ కార్యకలాపాలు, విపత్తు ముప్పు తగ్గింపుతో పాటు భవిష్యత్తు విపత్తులను ఎదుర్కొనే వ్యవస్థ పటిష్టత తదితర అంశాలపై సమీక్షించి, సమన్వయ శాఖల అధికారులతో చర్చించారు. మాక్ డ్రిల్స్ నిర్వహణ, సామర్థ్య నిర్మాణంపై అధికారులకు శిక్షణ, సమన్వయం వంటి అంశాల్లో జిల్లాలో చర్యలు బాగున్నాయన్నారు. బుడమేరు వరదల సమయంలో బాధితులకు చేయూతనివ్వడం, పునర్మిర్మాణ చర్యల్లో అధికార యంత్రాంగం చూపిన చొరవను కూడా బృందం సభ్యులు ప్రశంసించారు.
వరదల్లో వ్యవసాయ డ్రోన్లతో ఆహారం పంపిణీ..
ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనే సరైన సన్నద్ధత విషయంలో ప్రతి శాఖా తమదైన ప్రత్యేక విపత్తు నిర్వహణ ప్రణాళికలను రూపొందించడం కీలకమని చెప్పారు. చట్ట ప్రకారం కొత్తగా పట్టణ విపత్తు నిర్వహణ అథారిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరముందన్నారు. ప్రకృతి వైపరీత్యాలపై రియల్టైమ్ హెచ్చరికల వ్యవస్థలో సచేత్ కీలక మైలురాయి అని, ఈ యాప్పై అధికారులతో పాటు ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. విపత్తు నిర్వహణ ప్రణాళికలో ఏఐ, డ్రోన్ టెక్నాలజీ వంటి సాంకేతికతలను పొందుపరచడంపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. ఆపద మిత్ర, ఇతర వలంటీర్ సేవలకు ముఖ్యంగా యువతను ప్రోత్సహించాలని ఎన్డీఎంఏ అధికారుల బృంద సభ్యులు పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ బుడమేరు వరదల్లో వ్యవసాయ డ్రోన్లను ఆహారం పంపిణీకి ఉపయోగించామన్నారు. పారిశుద్ధ్య కార్యకలాపాల్లోనూ డ్రోన్లను వినియోగించినట్లు తెలిపారు. సమావేశంలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం, డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, కేఆర్ఆర్సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ కె.పోసిబాబు, జిల్లా అగ్నిమాపక అధికారి ఏవీ శంకరరావు, డీఎంహెచ్వో ఎం.సుహాసిని, డీపీవో పి.లావణ్య కుమారి, డీఆర్డీఏ పీడీ ఏఎన్వీ నాంచారరావు, డీఏవో డీఎంఫ్ విజయకుమారి, పశు సంవర్థక అధికారి ఎం.హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.