
పోలీస్ ప్రజావాణిలో 66 ఫిర్యాదులు
విజయవాడస్పోర్ట్స్: నగరంలోని జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిస్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి 66 ఫిర్యాదులను స్వీకరించినట్లు డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(డీసీపీ) ఏబీటీఎస్ ఉదయరాణి తెలిపారు. పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడటంతో పాటు వృద్ధులు, దివ్యాంగుల వద్దకు వెళ్లి వారి సమస్యను తెలుసుకుని ఫిర్యాదులను స్వీకరించామని తెలిపారు. ఆస్తి వివాదాలు, నగదు లావాదేవీలకు సంబంధించినవి 37, కుటుంబ కలహాలపై ఎనిమిది, కొట్లాటలపై ఎనిమిది, దొంగతనాలపై మూడు, మహిళా సంబంధిత నేరాలపై ఒకటి, ఇతర సంఘటనలకు సంబంధించి తొమ్మిది ఫిర్యాదులను స్వీకరించినట్లు డీసీపీ వెల్లడించారు. ఈ ఫిర్యాదులను నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించాలని సంబంధిత స్టేషన్ అధికారులను ఆమె ఆదేశించారు.