
ఆక్రమణకు గురైన అమ్మవారి భూములపై సమీక్ష
భవానీపురం(విజయవాడపశ్చిమ): విజయవాడ కేదారేశ్వరపేట పరిధిలోని లోటస్ ప్రాంతంలో ఆక్రమణకు గురైన శ్రీకనకదుర్గమ్మ అమ్మవారి భూములకు సంబంధించి శ్రీదుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం కార్యనిర్వహణాధికారి వీకే శీనానాయక్ సమీక్ష జరిపారు. ఆక్రమణకు గురైన భూములలో వెలిసిన కట్టడాల క్రయ విక్రయాలను నిలుపుదల చేస్తూ 22ఏ 1సీ నిషేధిత జాబితాలో చేర్చడంపై రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, నగరపాలక సంస్థలతో సమన్వయం గురించి సోమవారం సాయంత్రం దేవాలయ లీజెస్, ల్యాండ్ విభాగం సిబ్బందితో సమీక్షించారు. సత్యనారాయణపురం పాత సర్వే నంబర్ 118, ఆర్ఎస్ నంబర్ 112లో సుమారు రూ.200 కోట్ల విలువైన ఈ భూమి సంరక్షణ నిమిత్తం దేవస్థానం నుంచి ఎటువంటి కాలయాపన లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఈఓ తెలిపారు. అదే విధంగా మహామండపం దిగువ ప్రాంతంలో స్థలాభావ సమస్య పరిష్కారం కోసం ఆలయ ఇంజినీర్ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. నూతన అన్న ప్రసాదం భవన నిర్మాణం, లడ్డూ పోటు భవన నిర్మాణ ప్రాంతాల్లో ఇంకా స్థల సేకరణపై సాధ్యాసాధ్యాల గురించి చర్చించారు. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు కోటేశ్వరరావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
యోగా నిత్య జీవితంలో ఓ భాగం కావాలి
మచిలీపట్నంటౌన్: యోగా ప్రతి ఒక్కరి నిత్య జీవితంలో ఓ భాగం కావాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఏపీ యోగసభ ఆధ్వర్యంలో స్థానిక గాంధీనగర్లోని ఉదయపు నడక మిత్రమండలి భవనంలో సోమవారం యోగా గురువు మద్దాల చింతయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా శిక్షణ తరగతుల్లో కలెక్టర్ పాల్గొని సూర్య నమస్కారాలు, ప్రాణాయామం, యోగాసనాలు వేశారు. యోగా కార్యక్రమం అధికారికంగా ముగిసినప్పటికీ యోగా సాధన మన నిత్యజీవితంలో ఓ భాగం చేసుకుని నిరంతరం కొనసాగించాలని సూచించారు. మచిలీపట్నం నగరంలో ఏపీ యోగాసభ ఆధ్వర్యంలో గాంధీనగర్, చింతగుంటపాలెం, కాస్మోపాలిటన్ క్లబ్, గొడుగుపేట, శంకరమఠంలో ఉచితంగా యోగా తరగతులు నిర్వహిస్తున్నారన్నారు.