
వైఎస్ జగన్పై కూటమి భారీ కుట్ర
వైఎస్సార్ సీపీ నేత పోతిన వెంకట మహేష్
వన్టౌన్(విజయవాడపశ్చిమ): మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కూటమి ప్రభుత్వం భారీ కుట్రకు పాల్పడుతోందని వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా పరిశీలకుడు పోతిన వెంకట మహేష్ విమర్శించారు. జగన్ పల్నాడు పర్యటనపై తాను మాట్లాడిన వీడియోను మహేష్ సోమవారం విడుదల చేశారు. అందులో ఆయన మాట్లాడుతూ.. ప్రమాదం జరిగిన వెంటనే గుంటూరు అర్బన్ ఎస్పీ సతీష్కుమార్ నేరుగా పత్రికా ప్రకటన విడుదల చేసి, మీడియాతో సమావేశమై కాన్వాయ్ ఉన్న ప్రైవేటు వెహికల్ ఢీ కొందని, ఆ ప్రైవేటు వాహనం నంబర్ ఇదీ అని ప్రకటించారని గుర్తుచేశారు. ఆ వాహనం ఓనర్ను పిలిపించి వాళ్లను జామీను తీసుకుని స్టేషన్ బెయిల్ మీద విడుదల చేయడం వాస్తవం కాదా, మీరు దీన్ని కాదనగలరా? అని ప్రశ్నించారు. ప్రమాదం జరిగిందని తెలియగానే.. జగన్ కాన్వాయ్ను అనుసరిస్తున్న నాయకులు లాన్ మీద ఉన్న సింగయ్యను చూసి ఆటోలోగానీ, సొంత కారులోగానీ ఆస్పత్రికి తీసుకెళ్తామని అక్కడున్న పోలీసులను అడిగితే వాళ్లు నిరాకరించారని, 108 వాహనం ద్వారా మాత్రమే పంపిస్తామని అక్కడున్న ఏఎస్ఐ రాజశేఖర్ చెప్పారని పేర్కొన్నారు. దీని వల్ల అమూల్యమైన 35 నిమిషాల సమయం వృథా అయ్యిందని, నాయకుల వాహనంలో తీసుకెళ్లేందుకు అనుమతించి ఉంటే ప్రాణాలు కాపాడే వారిమని మహేష్ స్పష్టంచేశారు.
మాజీ సీఎంపై కేసు నమోదు..
పోలీసుల దుందుడు చర్య
వైఎస్ జగన్మోహన్రెడ్డి సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల గ్రామానికి చేరి, తిరిగి వచ్చేటప్పుడు దురదృష్టకర ఘటన జరిగిందని పార్టీ నాయకులు ఆయన దృష్టికి తీసుకువెళ్లారని తెలిపారు. ప్రత్తిపాడు పార్టీ ఇన్చార్జి బాలసాని కిరణ్, తర్వాత మాజీ మంత్రి అంబటి రాంబాబు సహా పార్టీ నాయకులు ఆస్పత్రికి చేరుకున్నారని వైఎస్ జగన్ దృష్టికి తీసుకువెళ్లారని పేర్కొన్నారు. మరుసటి రోజు కూడా ఆ కుటుంబం దగ్గరకు వెళ్లాలని, కష్టంలో ఉన్న ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని, రూ.10 లక్షల ఆర్థిక సహాయం చేయాలని వైఎస్ జగన్ ఆదేశాలు ఇచ్చారన్నారు. ఒక మనిషిని కోల్పోయిన కుటుంబానికి చేతనైనంత మేర పార్టీగా తమ బాధ్యతను నిర్వర్తించామని మహేష్ పేర్కొన్నారు. మానవత్వం గురించి, నైతికత గురించి టీడీపీ పాఠాలు చెప్పడం ఆశ్చర్యంగా ఉందని పోతిన మహేష్ పేర్కొన్నారు. ఏదైనా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయినప్పుడు ఆ వీడియోను వాస్తవమో కాదో తెలుసుకున్న తర్వాతే ఎస్పీ స్థాయి అధికారి కానీ పోలీసు ఉన్నతాధికారులు గానీ బయటకు వస్తారని, అలాంటి నిర్ధారణలేవీ లేకుండానే ఒక మాజీ ముఖ్యమంత్రిపై కేసు పెట్టడం దుందుడుకు చర్య అని దుయ్యబట్టారు.