
కర్కశపు తండ్రి కటకటాల పాలు
మైలవరం: మైలవరంలో ఇటీవల ఇద్దరు చిన్నారులను తండ్రే హత్య చేసి తానూ ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖ రాసి కనబడకుండా పోయిన నిందితుడు రవిశంకర్ కటకటాల పాలయ్యాడు. మైలవరం పోలీస్ స్టేషన్లో సోమవారం సీఐ చంద్రశేఖర్ విలేకర్ల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. ఈ నెల 12న మైలవరంలోని మారుతీనగర్లో ఓ రేకుల షెడ్డు నుంచి దుర్వాసన వస్తుందని స్థానికులు తమకు సమాచారం అందించారు. పోలీస్ సిబ్బంది ఆ ఇంటికి వెళ్లి తలుపులు తెరచి చూడగా ఇద్దరు చిన్నారులు వేములమడ హిరణ్య(12), వేములమడ సాయి(9) విగత జీవులుగా మంచంపై పడి ఉన్నారు. వారి తండ్రి వేములమడ రవిశంకర్ చిన్నారులను హత్య చేశాడు. భార్యపై అనుమానం, పిల్లలు తనకు పుట్టలేదన్న అపోహతో ఈ హత్యలకు పాల్పడ్డాడు.
సాంకేతిక పరిజ్ఞానంతో అరెస్ట్..
రవిశంకర్, అతని భార్య చంద్రిక గత కొంతకాలంగా విడివిడిగా ఉంటున్నారు. చంద్రిక ఉపాధి కోసం విదేశాలకు వెళ్లింది. దంపతుల మధ్య చాలా రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. నిందితుడు రవిశంకర్కు భార్యపై అనుమానం ఉండటంతో ఆ పిల్లలు తనకు పుట్టారా అని పలుమార్లు భార్యను ప్రశ్నించడం, అనుమానంగా చేస్తుండేవాడని విచారణలో తేలింది. మైలవరంలోని అతని నివాసంలో ముందుగా చిన్నారి సాయిని ఓ చీరతో ఒక గదిలో ఉరివేసి చంపాడు, తరువాత హిరణ్యను మరో గదిలో దిండుతో ముఖంపై అదిమిపట్టి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు. ఇద్దరినీ ఒకే మంచంపై పడుకోబెట్టాడు. కేసు తప్పుదారి పట్టించేందుకు ఇబ్రహీంపట్నం ఫెర్రీలో సిమ్ కార్డు వదిలి వైజాగ్ పారిపోయాడు. సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడిని పట్టుకున్నామన్నారు. మంగళవారం నిందితుడిని కోర్టులో హాజరు పర్చనున్నట్లు సీఐ చంద్రశేఖర్ తెలిపారు. విలేకరుల సమావేశంలో ఎస్ఐ సుధాకర్, సిబ్బంది పాల్గొన్నారు.
కారు – ఆటో ఢీ : నలుగురికి గాయాలు
మక్కపేట(వత్సవాయి): కారు ఆటో ఢీ కొన్న ప్రమాదంలో నలుగురికి గాయాలైన ఘటన సోమవారం గ్రామ శివారులో జరిగింది. జగ్గయ్యపేట వైపు నుంచి వస్తున్న కారు వత్సవాయి వైపు నుంచి వస్తున్న ఆటో ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఆటోలో ఉన్న నలుగురు ప్రయాణికులకు కాళ్లు, చేతులు, తలకు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను ఆటోల్లో జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు.