
అర్జీల పరిష్కారంలో అలసత్వం వద్దు
కలెక్టర్ జి.లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అర్జీల పరిష్కారంలో అలసత్వం వద్దని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ అధికారులను హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. కలెక్టర్ జి.లక్ష్మీశ, జేసీ ఎస్.ఇలక్కియ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువస్తే పరిష్కార మార్గం లభిస్తుందని ఎంతో ఆశతో గ్రీవెన్స్ సెల్ను ఆశ్రయిస్తున్నారన్నారు. వారి నమ్మకానికి బలం చేకూర్చడానికి నాణ్యతతో అర్జీలు పరిష్కరించాలన్నారు. మానవతాదృక్పథంతో సానుకూలతతో సమస్యలను పరిష్కరించడంపై దృష్టిపెట్టాలన్నారు. ఇకపై అర్జీల పరిష్కారంపై తాను ప్రతి రోజూ సమీక్ష నిర్వహిస్తానని, పరిష్కారంలో సరైన కారణం లేకుండా జాప్యం జరిగినా, నాణ్యత లేకపోయినా చర్యలు తప్పవని హెచ్చరించారు.
189 అర్జీల స్వీకరణ
రెవెన్యూ శాఖకు సంబంధించి 93, పోలీస్ శాఖకు 22, విద్య 12, ఎంఏయూడీ 10, అటవీ 5, పంచాయతీరాజ్ 5, సర్వే 5, రిజిస్టేషన్ అండ్ స్టాంప్స్ 4, ఏపీఎస్డబ్ల్యూఆర్ఇఈఎస్ 3, హౌసింగ్ 3, గ్రామీణ నీటి సరఫరా 3, వ్యవసాయం 2, సహకార శాఖ 2, విభిన్న ప్రతిభావంతులు 2, డీఆర్డీఏ 2, ఉపాధి హామీ 2, హెల్త్ 2, విద్యుత్, పౌరసరఫరాలు, కళాశాల విద్య, డ్వామా, మత్య్స, జలవనరులు, కేడీసీసీ సీఈవో, కార్మిక శాఖ, బ్యాంకు, గనులు, ఆర్ అండ్ బీ, సాంకేతిక విద్యకు సంబంధించిన ఒక్కో అర్జీతో కలిపి మొత్తం 189 అర్జీలను స్వీకరించామని కలెక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. కార్యక్రమంలో గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి, సమగ్రశిక్ష అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ మహేశ్వరరావు, వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.