
రేపటి నుంచి ఏపీ ఈఏపీ సెట్
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఇంజినీరింగ్, అగ్రికల్చల్, ఫార్మసీ కోర్సుల ప్రవేశాలకు సంబంధించి ఏపీ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ – పరీక్ష (ఏపీఈఏపీసెట్)– 2025 సోమవారం నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రారంభం కానుంది. సంబంధిత పరీక్షలను కంప్యూటర్ ఆధారిత (ఆన్లైన్) విధానంలో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు సిద్ధం చేశారు. ఇందులో భాగంగా అగ్రికల్చర్, ఫార్మసీ (బైపీసీ) విద్యార్థులకు ఈ నెల 19, 20 తేదీలలో ఆన్లైన్ పరీక్ష నిర్వహించనుండగా ఇంజినీరింగ్ స్టీమ్ (ఎంపీసీ) విద్యార్థులకు 21 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇందులో ప్రతి రోజు ఉదయం, సాయంత్రం రెండు సెషన్స్లో పరీక్షలు జరగనున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 15 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. ఇందులో ఎన్టీఆర్ జిల్లాలో ఇంజినీరింగ్కు 37,666 మంది, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు 6671 మంది, రెండు పరీక్షలకు హాజరువుతున్న వారు 86 మంది ఉండగా మొత్తం జిల్లాలో పరీక్షకు హజరయ్యేవారు 44,468 మంది విద్యార్థులు ఉన్నారు. రాష్ట్రం మొత్తం మీద అత్యధికంగా 38,269 మంది విద్యార్థులు ఒక్క విజయవాడలోనే పరీక్షలకు హాజరవ్వనున్నారు. అలాగే కృష్ణా జిల్లాకు సంబంధించి ఇంజనీరింగ్ విభాగానికి 5,050 మంది, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి 1141, ఇంజినీరింగ్, ఫార్మసీ పరీక్షలకు హాజరవుతున్నవారు 18 మంది జిల్లా వ్యాప్తంగా హాజరయ్యే వారు 6209 మంది విద్యార్థులున్నారు. ఇందులో ఉదయం సెషన్ తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం సెషన్కు 2.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు ఆన్లైన్లో పరీక్షను నిర్వహించనున్నారు.
జిల్లాలో పరీక్ష కేంద్ర వివరాలు ఇలా...
ఈఏపీసెట్ పరీక్ష కోసం ఉమ్మడి కృష్ణా జిల్లాలో 15 పరీక్షా కేంద్రాలను సిద్ధం చెశారు. ఎన్టీఆర్ జిల్లాలో పన్నెండు, కృష్ణా జిల్లాలో మూడు కేంద్రాలు ఉన్నాయి. అవి ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి ధనేకుల ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, ఐకాన్ డిజిటల్ జోన్ కానూరు, ఎన్ఆర్ఐ గ్రూప్ ఆఫ్ కాలేజీస్, పొట్టిశ్రీరాములు చలవాది మల్లికార్జునరావు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ప్రసాద్ వీ పొట్లూరి సిద్ధార్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎస్ఆర్కే ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సాయిలక్ష్మీ కంప్యూటర్స్, గొల్లపూడి, శ్రీ విజయదుర్గా ఐటీ ఇన్ఫో సొల్యూయేషన్స్, కానూరు (కానూరు ఎనికేపాడు డొంకరోడ్డు), ఎస్వీటీ ఇన్ఫోటెక్, గవర్నరుపేట విజయవాడ, వెలగపూడి రామకృష్ణ సిద్థార్థ ఇంజనీరింగ్ కళాశాలను ఎంపిక చేశారు. అదేవిధంగా తిరువూరులో శ్రీవాహిణి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరువూరు, మైలవరంలో లక్కిరెడ్డి బాలిరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మైలవరం తదితర కేంద్రాలను కేటాయించారు. అదేవిధంగా కృష్ణాజిల్లాలో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ గుడ్లవల్లేరు, దైతా మధుసూధన్ శాస్త్రి శ్రీ వెంకటేశ్వర హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మచిలీపట్నం, శ్రీ వాసవీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, నందమూరు మచిలీపట్నం కేంద్రాలు ఉన్నాయి.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో 15 పరీక్ష కేంద్రాలు రెండు జిల్లాల్లో పరీక్షకు హాజరుకానున్న 50,677 మంది విద్యార్థులు రాష్ట్రంలో అత్యధికంగా విజయవాడలోనే పరీక్షకు హాజరు కానున్న విద్యార్థులు 19, 20వ తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు 21 నుంచి 27 వరకూ ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు