
మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజినీరింగ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్ నందు ఏపీ మున్సిపల్ ఇంజినీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శనివారం ధర్నా జరిగింది. సమాన పనికి సమాన వేతనం, కార్మికులను పర్మినెంట్ చేయాలని నినాదాలు చేశారు. ధర్నాలో పాల్గొన్న యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.కోటేశ్వరరావు గౌడ్, గౌరవాధ్యక్షుడు గుంటుపల్లి శేషగిరిరావు మాట్లాడుతూ.. అత్యవసర విభాగాలైన నీటి సరఫరా, వీధి దీపాలు, డ్రెయినేజీ, పార్క్లు, మెకానిక్లు, టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్ అన్ని విభాగాల్లో పనిచేస్తున్న టెక్నికల్ సిబ్బందికి రూ.29,200లు, నాన్ టెక్నికల్ సిబ్బందికి రూ.24,500లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 10 ఏళ్ల సర్వీసు పైబడిన కార్మికులను క్రమబద్ధీకరించాలన్నారు.
ప్రభుత్వ పథకాలు అమలు చేయాలి..
కార్మికులకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆప్కాస్ను రద్దు చేస్తే కార్మికులందరిని పర్మినెంట్ చేయాలన్నారు. కార్మికుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు, ఇతర ఉద్యోగుల మాదిరిగా గ్రాట్యుటీ, కనీస పెన్షన్ రూ.10 వేలు ఇవ్వాలి, ఆదివారాలు, దేశ, జాతీయ పండుగలకు సెలవు దినాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో చనిపోయిన కార్మికులకు కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ధర్నాలో యూనియన్ సమన్వయ కార్యదర్శి బత్తుల శివశంకర్, నగర అధ్యక్షుడు పిట్టా మహేష్, కార్యదర్శి ఎండీ గౌస్, ఉపాధ్యక్షులు బుచ్చిబాబు, వి.జైపాల్, బి.నాగరాజు, నాయకులు సాంబశివరావు, విష్ణుప్రసాద్, శివాజీ, బి.విజయ్, ఎన్.దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.
రైల్వేస్టేషన్లో అనారోగ్యంతో వ్యక్తి మృతి
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): విజయవాడ రైల్వేస్టేషన్లో అనారోగ్యంతో వ్యక్తి మృతి చెందిన ఘటనపై ప్రభుత్వ రైల్వే పోలీసులు(జీఆర్పీ) కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం ఉదయం ప్లాట్ఫాం నంబర్ 1లోని దక్షిణ ప్రవేశ ద్వారం, బుకింగ్ కార్యాలయం వద్ద గుర్తు తెలియని మగ వ్యక్తి చనిపోయి ఉండటాన్ని గుర్తించిన సిబ్బంది జీఆర్పీ పోలీస్స్టేషన్కు సమాచారం అందించారు. దీంతో హెడ్కానిస్టేబుల్ పార్థసారథి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి వయసు 45 నుంచి 50 ఏళ్ల మధ్య ఉంటుందని, ఒంటిపై నలుపు రంగు ఫ్యాంటు, నలుపుపై తెలుపు గడుల చొక్కా ధరించి ఉన్నాడని, ఇతర ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని తెలిపారు. మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు విజయవాడ జీఆర్పీ స్టేషన్ లేదా 88971 56153 ఫోన్ నంబర్లో సంప్రదించాలని పోలీసులు కోరారు.

మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలి