
దోమల చక్రం నిప్పుతో అగ్నిప్రమాదం
అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): దోమల బెడదను తప్పించుకునేందుకు వెలిగించిన దోమల చక్రం నిప్పు మంచానికి అంటుకోవడంతో అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సంఘటన అజిత్సింగ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని న్యూరాజరాజేశ్వరీపేటలో శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు స్థానిక 57వ డివిజన్ న్యూరాజరాజేశ్వరీపేట సచివాలయం సమీపంలో నివసిస్తున్న అల్లు సింహాచలం పెయింటింగ్ పనులు చేస్తూ ఉంటాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య గర్భవతి కావడంతో కొన్ని రోజుల కిందటే పిల్లలను తీసుకొని ఆమె తన పుట్టింటికి వెళ్లగా సింహాచలం తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ఇంటిలో దోమల చక్రం వెలిగించుకుని నిద్రపోయారు. అయితే అర్ధరాత్రి సమయంలో ప్రమాదవశాత్తు దోమల చక్రం నిప్పు... సింహాచలం తల్లిదండ్రులు నిద్రిస్తున్న నవారు మంచంపై పడి మంటలు అంటుకున్నాయి. మంటలు చెలరేగి గది అంతా వ్యాపించాయి. మంటల వేడికి నిద్రపోతున్నవారు లేచి చూడగా అప్పటికే వారికి మంటలు అంటుకుని ఉన్నాయి. దీంతో బాధితులు పెద్దపెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కల ప్రాంతాలవారు హూటాహూటిన వచ్చి మంటలు అదుపుచేశారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అగ్నిప్రమాదంలో గాయపడిన సింహాచలం, అతని తల్లిదండ్రుల పరిస్థితి నిలకడగా ఉందని, బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.