
40 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత
కృష్ణలంక(విజయవాడతూర్పు): అక్రమంగా వ్యాన్లో తరలిస్తున్న పీడీఎస్(రేషన్) బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ అధికారులు పట్టుకున్నారు. విజయవాడ సర్కిల్–2 ఏఎస్వో శ్రీనివాసులుకు అందిన పక్కా సమాచారం మేరకు మంగళవారం రాత్రి ఆయన కృష్ణలంకలోని నెహ్రూనగర్ డొంకరోడ్డులో ఉన్న వ్యాన్ను తనిఖీ చేశారు. కృష్ణలంకకు చెందిన వ్యాన్ యజమాని సుబ్బారావును పిలిపించి వ్యాన్ను తెరిచి చూడగా అందులో ఒక్కొక్కటి 50 కేజీల చొప్పున 40 బస్తాల పీడీఎస్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. ఎక్కడ నుంచి తరలిస్తున్నారని సుబ్బారావును ప్రశ్నించగా కృష్ణలంక, ద్వారకానగర్లోని ఒక రేషన్ డిపో నుంచి తరలిస్తున్నట్లు అంగీకరించాడు. వెంటనే వ్యాన్ను స్వాధీనం చేసుకుని కృష్ణలంక పోలీసులకు అప్పగించారు. వ్యాన్ను సీజ్ చేసి రేషన్ డిపో డీలర్ కృష్ణమూర్తి, సుబ్బారావులపై 6ఏ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
విరివిగా మొక్కలు నాటాలి
చిలకలపూడిమచిలీపట్నం): విరివిగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో బుధవారం ఆయన వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో జూన్ 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లాలో మొక్కలు నాటే కార్యక్రమంపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గురువారం జిల్లా వ్యాప్తంగా 2.92 లక్షల మొక్కలను నాటే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, వివిధ సంక్షేమ శాఖ వసతి గృహాల ఆవరణల్లో మొక్కలు నాటాలని సూచించారు. డ్వామా పీడీ ఎన్వీ శివ ప్రసాద్ యాదవ్, జిల్లా పంచాయతీ అధికారి జె.అరుణ ఇరువురు సమన్వయం చేసుకుంటూ మొక్కలు నాటే ప్రక్రియను చేపట్టాలన్నారు.

40 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత