
కుండల తయారీ పేరుతో మట్టి అక్రమ రవాణా
జి.కొండూరు: టీడీపీ నాయకులు మట్టి అక్రమ రవాణా కోసం వినూత్న మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇటీవల రెడ్డిగూడెం మండల పరిధి నాగులూరు జువ్వి చెరువులో మట్టిని రైతుల పొలాలకు మెరక పేరుతో అనుమతులు పొంది ఇటుక బట్టీలకు తరలించిన ఘటన మరవక ముందే జి.కొండూరు మండల పరిధి కోడూరు ఎర్ర చెరువులో మట్టిని కుమ్మరులకు కుండల తయారు చేసే పేరుతో ఇటుక బట్టీలకు తరలిస్తున్న ఘటన బుధవారం వెలుగుచూసింది. వివరాలలోకి వెళ్తే...కోడూరు ఎర్రచెరువు నుంచి మైలవరం మండల పరిధి గణపవరం గ్రామంలో కుండలు తయారు చేసే కుమ్మరులకు మట్టి తరలిస్తున్నామంటూ స్థానిక టీడీపీ నాయకులు బుధవారం ఉదయం మట్టి అక్రమ రవాణాకు తెరలేపారు. కుమ్మరులకు అవసరమైన మట్టిని తరలించిన అనంతరం ఆ పక్కనే ఉన్న ఇటుక బట్టీలకు మట్టిని తరలించడం ప్రారంభించారు. ఈ తవ్వకాల కోసం రెండు పొక్లెయిన్లు, వంద ట్రాక్టర్లతో మట్టి రవాణా చేస్తుండడంతో కోడూరు, గణపవరం గ్రామాలలో రహదారిపై దుమ్ము లేచిపోయి గ్రామస్తులు కొద్ది గంటల సేపు నరకయాతన అనుభవించారు. పదుల సంఖ్యలో ట్రాక్టర్లు ఒకదాని వెంట ఒకటి మితిమీరిన వేగంతో రాకపోకలు సాగిస్తున్న క్రమంలో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మట్టి తవ్వకాల సమాచారం అందుకున్న జి.కొండూరు పోలీసులు చెరువు వద్దకు చేరుకొని తవ్వకాలను నిలిపివేశారు. దీనిపై ఎస్ఐ సతీష్కుమార్ని వివరణ కోరగా ఎటువంటి అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలను కొనసాగిస్తున్నందున అడ్డుకున్నామన్నారు.