
యోగాసనాల సాధనతో శరీరానికి కొత్త శక్తి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): యోగాసనాల సాధనతో శరీరానికి, మనసుకు కొత్త శక్తి వస్తుందని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. యోగాంధ్ర–2025 మాసోత్సవాల్లో భాగంగా 15వ రోజు బుధవారం బీఆర్టీఎస్ యోగా స్ట్రీట్లో ఆయుష్ శాఖ, జిల్లా అధికార యంత్రాంగం, విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మాజీ సైనికోద్యోగులు, పెన్షనర్లతో కలిసి కలెక్టర్ లక్ష్మీశ యోగాసనాలు వేశారు. అనంతరం మాట్లాడుతూ భారతీయ వారసత్వ సంపద అయిన యోగాను నేడు ప్రపంచమంతా అనుసరిస్తోందని, ఇది మన దేశానికి గర్వకారణమని అన్నారు. ప్రతిఒక్కరి జీవితంలో యోగా భాగం కావాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత ఆధునిక జీవనశైలిలో ఒత్తిడితో పాటు వివిధ అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని, ఇలాంటి వాటి నుంచి రక్షణ పొందేందుకు ఆరోగ్యకర జీవితాన్ని సొంతం చేసుకునేందుకు యోగాసనాల అభ్యసన ముఖ్యమన్నారు. జూన్ 21 నాటికి జిల్లాలో దాదాపు 10 లక్షల మందికి యోగాసనాలు నేర్పించేందుకు జిల్లా యంత్రాంగం వేలాదిమంది శిక్షకులను ఏర్పాటు చేసిందన్నారు. గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు ప్రతిరోజూ ప్రత్యేక యోగా కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. యోగా సాధనను జీవితాంతం ఆచరించేలా ప్రజలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.
డ్రగ్స్ వద్దు బ్రో...
జిల్లా ఈగల్ టీమ్ ఆధ్వర్యంలో డ్రగ్స్ వద్దు బ్రో పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. తెలిసీ తెలియని వయసులో కొందరు యువకులు మాదకద్రవ్యాలకు బానిసలుగా మారుతున్నారని, వారిని అలాంటి దురలవాట్ల నుంచి దూరం చేసేందుకు, డ్రగ్స్ రహిత రాష్ట్రం సాకారానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ‘ఈగల్ టీం (టోల్ఫ్రీ నంబరు 1972)కు ప్రజలందరూ సహకరించాలని కలెక్టర్ లక్ష్మీశ పిలుపునిచ్చారు. మత్తుపదార్థాలు కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తాయని, డ్రగ్స్ను సమాజం నుంచి దూరం చేసేందుకు ప్రతిఒక్కరూ సహకరించి చేయీచేయీ కలిపి ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో విజయవాడ ఆర్డీఓ కావూరి చైతన్య, జిల్లా సైనిక సంక్షేమ అధికారి కళ్యాణవీణ.కె, మాజీ సైనికుడు జగన్మోహన్, మాజీ సైనిక సంక్షేమ సంఘాలకు చెందిన సుబేదార్ కె.కె.నరసింహారావు(రిటైర్డ్), నాయబ్ సుబేదార్ మోటూరి శంకర రావు(రిటైర్డ్), ఈగల్ ఇన్స్పెక్టర్ టి.ధనుంజయనాయుడు, డీఎంహెచ్వో ఎం.సుహాసిని, కాలుష్య నియంత్రణ ఈఈ పి.శ్రీనివాస్, ఆయుష్ అధికారులు వి.రాణి, రామత్లేహి, రత్నప్రియదర్శిని, యోగా ట్రైనర్లు సత్యనారాయణ, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ