
రైతుల గోడు పట్టించుకోని కూటమి సర్కార్
తిరువూరు: రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని, పంటలు అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి చందంగా ఉన్నాయని, రైతుల సమస్యలు ప్రభుత్వం పట్టించుకోవట్లేదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆరోపించారు. తిరువూరు మండలం జి.కొత్తూరులో వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు శీలం కృష్ణారెడ్డి ఇటీవల మృతిచెందారు. ఈ నేపథ్యంలో బుధవారం కృష్ణారెడ్డి కుటుంబసభ్యుల్ని అవినాష్ పరామర్శించారు. అనంతరం పంట పొలాలను పరిశీలించి ధాన్యం రైతులతో మాట్లాడారు. వరి, మిర్చి రైతుల కష్టాలను ప్రభుత్వం పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని, ధాన్యం రైతులకు గన్నీ బ్యాగులు కూడా ఇవ్వకపోవడం తగదన్నారు. పలు సహకార సంఘాల్లో అధికార పార్టీ అనుచరులైన రైతులకు మాత్రమే అధికారులు అనుకూలంగా వ్యవహరిస్తూ సన్న, చిన్నకారు రైతుల నోట్లో మట్టి కొడుతున్నారని ఆరోపించారు. మిర్చికి మద్దతు ధరలేక, ధాన్యం కొనుగోలు చేసేవారు లేక దిక్కుతోచని స్థితిలో రైతులు ఉన్నారని, ఎన్టీఆర్ జిల్లాలో అధికారులు మొద్దునిద్ర పోతున్నారన్నారు. రైతుల సమస్యలపై టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు ఉదాసీన వైఖరి అవలంబించడాన్ని ప్రజలు గమనిస్తున్నారని, గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వమే మేలని ప్రతి ఒక్కరూ అభిప్రాయపడుతున్నారన్నారు. ఎక్కడ రైతుకు ఇబ్బంది కలిగినా ఆదుకోవడానికి తాము ముందుంటామని అవినాష్ చెప్పారు. తిరువూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి నల్లగట్ల స్వామిదాసు, వైఎస్సార్ సీపీ తిరువూరు మండల అధ్యక్షుడు తాళ్ళూరి నవీన్కుమార్, తిరువూరు జెడ్పీటీసీ సభ్యుడు యరమల రామచంద్రారెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు రేగళ్ళ మోహన్రెడ్డి, కంచర్ల ముత్యప్రసాద్, నరెడ్ల వీరారెడ్డి, మామిడి కుటుంబరావు, మోదుగు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
దేవినేని అవినాష్