ఏపీ ఫైబర్‌నెట్‌ను ప్రభుత్వమే పరిరక్షించాలి | - | Sakshi
Sakshi News home page

ఏపీ ఫైబర్‌నెట్‌ను ప్రభుత్వమే పరిరక్షించాలి

Apr 30 2025 5:16 AM | Updated on Apr 30 2025 5:16 AM

ఏపీ ఫైబర్‌నెట్‌ను ప్రభుత్వమే పరిరక్షించాలి

ఏపీ ఫైబర్‌నెట్‌ను ప్రభుత్వమే పరిరక్షించాలి

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ఏపీ ఫైబర్‌ నెట్‌ పరిస్థితి నానాటికీ దిగజారిపోతోందని, ఇదే పరిస్థితి కొనసాగితే మూతపడుతుందని ఏపీ కేబుల్‌ ఆపరేటర్స్‌ జేఏసీ ఆందోళన వ్యక్తం చేశారు. అలంకార్‌ సెంటర్‌లోని ధర్నా చౌక్‌ నందు ఏపీ కేబుల్‌ ఆపరేటర్స్‌ జేఏసీ ఆధ్వర్యంలో ఏపీ ఫైబర్‌ నెట్‌ను కాపాడాలని కోరుతూ మంగళవారం దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు మాట్లాడుతూ గడిచిన పది నెలల కాలంలో ఏపీ ఫైబర్‌ నెట్‌ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కనెక్షన్లు తగ్గిపోయాయన్నారు. గత ప్రభుత్వం నియమించిందన్న నెపంతో కూటమి ప్రభుత్వం సిబ్బందిని తొలగించడంతో జవాబుదారీతనం లోపించిందని చెప్పారు. దీనికి తోడు చైర్మన్‌ రాజీనామా, తరచూ ఎండీలను మార్చడంతో సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. తాజా పరిణామాలతో కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టిన ఆపరేటర్లు ఆత్మహత్యలకు పాల్పడాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే మంత్రిత్వ శాఖ కింద కొనసాగించడంతో పాటు అవసరమైన నిధులు కేటాయించి ఆదుకోవాలన్నారు. ఈ విషయంలో ప్రభుత్వ పెద్దలు స్పందించి ఫైబర్‌ నెట్‌ సంస్థను నిలబెట్టాలన్నారు. దీక్షలో జేఏసీ చైర్మన్‌ మిరియాల శ్రీరామ్‌, ప్రధాన కార్యదర్శి మధుబాబు, గౌరవాధ్యక్షుడు సీతారామయ్య, నాగిరెడ్డి వేణుగోపాలరెడ్డి, కేబుల్‌ ఆపరేటర్లు పాల్గొన్నారు.

2,412 కిలోల గంజాయి పట్టివేత.. నలుగురి అరెస్ట్‌

పెనమలూరు: మండల పరిధిలో 2,412 కిలోల గంజాయిని పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకొని, నలుగురు వ్యక్తులను అరెస్ట్‌ చేశారు. ఎస్‌ఐ ఫిరోజ్‌ తెలిపిన వివరాల ప్రకారం యనమలకుదురు గ్రామంలో పార్థసారథి కల్యాణమండపం వద్ద గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారంతో దాడి చేశామన్నారు. తాడేపల్లి మండలానికి చెందిన బేతాళ కౌషిక్‌, బొజ్జగాని భానుప్రకాష్‌ను అదుపులోకి తీసుకొని, వారి నుంచి 2,400 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మరో కేసులో పెనమలూరు సీఐ వెంకటరమణ మాట్లాడుతూ.. కానూరు సూపర్‌విజ్‌ రోడ్డులో గంజాయి అమ్ముతున్నారన్న సమాచారంతో ఎస్‌ఐ ఉషారాణి దాడి చేశారన్నారు. గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తుల నుంచి 12 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులు యనమలకుదురుకు చెందిన ముర్ల దేవరాజు, ముర్ల తేజగా గుర్తించామని, నిందితులను అరెస్ట్‌ చేసి, కేసు నమోదు చేశామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement