● తెలంగాణ జన సమితి ప్లీనరీని
విజయవంతం చేయాలి
● టీజేఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ
ప్రొఫెసర్ కోదండరాం
సుభాష్నగర్ : రాజకీయ వేదిక ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేసే పోరాటమని, అది డబ్బుతో కొనుగోలు చేసే వ్యాపారం కాదని తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. తెలంగాణ జన సమితి ప్లీనరీ సన్నాహక సమావేశాన్ని జిల్లాకేంద్రంలో సోమవారం నిర్వహించారు. ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారి జిల్లాకు వచ్చిన కోదండరాంను జిల్లా కమిటీ ఘనంగా స్వాగతం పలికి సన్మానించింది. ఈ సందర్భంగా జిల్లాలో తెలంగాణ జన సమితిని క్షేత్రస్థాయి నుంచి ఎలా బలోపేతం చేయాలనే అంశంపై కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేశారు. అనంతరం కోదండరాం మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించడంలో తెలంగాణ జన సమితి కీలకపాత్ర పోషించిందని గుర్తుచేశారు. మే 12న తెలంగాణ జన సమితి ప్లీనరీ జరగనుందని, భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం టీజేఎస్ జిల్లా అధ్యక్షుడిగా మహ్మద్ జాఫర్, ప్రధాన కార్యదర్శిగా మర్రి కిరణ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.


