ఏఎంసీకి కరెంట్‌ కట్‌ | - | Sakshi
Sakshi News home page

ఏఎంసీకి కరెంట్‌ కట్‌

May 4 2026 10:13 AM | Updated on May 4 2026 10:13 AM

ఐఎఫ్‌ఎంఎస్‌ పోర్టల్‌ వల్లే సమస్య

తీవ్ర ప్రభావం..

రూ.16 లక్షల బకాయిలు..

నిజామాబాద్‌ శ్రద్ధానంద్‌ గంజ్‌కు విద్యుత్‌ సరఫరా నిలిపివేత

ఉన్నతాధికారుల

ఆదేశాల మేరకు పునరుద్ధరణ

సుభాష్‌నగర్‌ : నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీకి ఎన్‌పీడీసీఎల్‌ అధికారులు ఆదివారం వి ద్యుత్‌ సరఫరాను నిలిపేశారు. ఆరు నెలలుగా రూ. 16 లక్షల వరకు పేరుకుపోయి బకాయిలను చెల్లించాలని మార్కెట్‌ కమిటీపై పలుమార్లు ఒత్తిడి తీసుకురావడంతోపాటు నెల రోజుల క్రితం నోటీసులు ఇచ్చారు. దీంతో మార్కెట్‌ కమిటీ అధికారులు చె క్కులు అందజేసినప్పటికీ ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంట్‌లో పాస్‌ కాకపోవడంతో బకాయిలు పేరుకుపోయా యి. ఇటు విద్యుత్‌ అధికారులు కనెక్షన్‌ కట్‌ చేశారు.

విద్యుత్‌ సరఫరా నిలిపేసిన విషయాన్ని మార్కెట్‌ సిబ్బంది చైర్మన్‌ ముప్ప గంగారెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన మార్కెటింగ్‌శాఖ డైరెక్టర్‌కు సమాచారమిచ్చారు. వారు కలెక్టర్‌తో చర్చించడంతో చైర్మన్‌ గ్యారెంటీ మీద ఐదు గంటల్లో పునరుద్ధరించారు. ఎన్‌పీడీసీఎల్‌ అధికారులు సూచించిన విధంగా చైర్మన్‌ సోమవారం గ్యారెంటీ లెటర్‌ ఇవ్వనున్నట్లు తెలిసింది.

గత ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మార్కెట్‌ కమిటీల్లో ఐఎఫ్‌ఎంఎస్‌ పోర్టల్‌ను అమల్లోకి తెచ్చింది. దీంతో ఆర్థిక కార్యకలాపాలైనా ఐఎఫ్‌ఎంఎస్‌ పోర్టల్‌లో ఎంట్రీ చేసి ప్రభుత్వం, ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంట్‌కు పంపించాల్సి వస్తోందని, ఈ విధానం కారణంగా తీవ్ర జాప్యం జరుగుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంట్‌లో చెక్కులు పాస్‌ కావడంలేదంటున్నారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలో ఎల్‌వోసీ విధానం అమల్లో ఉండగా, ఆర్థికశాఖలో చెక్కులు వెంట వెంటనే క్లియర్‌ అయ్యేవాని, ఐఎఫ్‌ఎంఎస్‌ పోర్టల్‌ను కొనసాగించడం వల్లే మార్కెట్‌ కమిటీల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఏఎంసీ చైర్మన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

గంజ్‌లో ప్రస్తుతం పసుపు,ఆమ్‌చూర్‌, ధాన్యం, ఇతర పంట దిగుబడుల క్రయవిక్రయాలు కొనసాగుతున్నాయి. మార్కెట్‌కు మూడు గేట్లు, ప్ర హరీ, 70 వరకు సీసీ కెమెరాలు ఉన్నా.. పలుమార్లు చోరీ ఘటనలు చోటుచేసుకున్నాయి. విద్యుత్‌ సరఫరా నిలిపేయడంతో సీసీ కెమెరాలు కూడా నిలిచిపోయాయి.

Advertisement
 
Advertisement
Advertisement