● యూరియా వాడకం తగ్గించాలి
● శాస్త్రవేత్త సమత పరమేశ్వరి
డిచ్పల్లి: వ్యవసాయంలో లాభదాయకత పెంచేందుకు రైతులు శాసీ్త్రయ పద్ధతులను అనుసరించాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త డాక్టర్ వై.సమత పరమేశ్వరి అన్నారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆదివారం డిచ్పల్లి మండలం బర్ధిపూర్ గ్రామంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పరమేశ్వరి మాట్లాడుతూ.. యూరియా వినియోగాన్ని తగ్గించి సేంద్రియ సాగు పద్ధతులు అవలంబించాలని సూచించారు. అవసరానికి మించి యూరియా వాడటం వల్ల నేలలోని సహజ పోషకాలు దెబ్బతిని, పంటల దిగుబడిపై ప్రతికూల ప్రభావం పడుతుందని అవగాహన కల్పించారు. సమతుల్య ఎరువుల వినియోగం ద్వారా సాగు ఖర్చులను తగ్గించడంతో పాటు నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. యూరియా వాడకాన్ని తగ్గించాలన్నారు. అనంతరం కార్యక్రమ కరపత్రాలను ఆవిష్కరించారు. సర్పంచ్ కోట్ల భాస్కర్, ఉప సర్పంచ్ తోట మహేష్, వ్యవసాయ విస్తరణాధికారి అశ్రితరాజ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.


