
డబ్బుల కోసం తల్లి హత్య
పోలీసుల అదుపులో కొడుకు
బోధన్రూరల్: డబ్బులు, నగల కోసం కన్నతల్లిని కొడుకు గొడ్డలితో నరికి హత్య చేసిన ఘటన బోధన్ మండలంలో కలకలం రేపింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. బోధన్ మండలం పెంటాకుర్దు గ్రామానికి చెందిన అంబం చంద్రకళకు మహారాష్ట్రకు చెందిన గైక్వాడ్ వెంకటితో 40 ఏళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరు కొడుకులు భూషణ్, సురేశ్, కూతురు జ్యోతి పుట్టిన తర్వాత చంద్రకళ భర్తకు దూరమై సుమారు 20 ఏళ్ల నుంచి పెంటాకుర్దులోనే ఒంటరిగా జీవిస్తోంది. పిల్లలందరికీ పెళ్లిళ్లు కాగా అప్పుడప్పుడు వారు తల్లి వద్దకు వెచ్చివెళ్తుంటారు. చిన్న కుమారుడు సురేశ్ నిత్యం తల్లి దగ్గరకు వచ్చి డబ్బులు తీసుకోవడం, డబ్బులు ఇవ్వకపోతే గొడవ పడుతుండేవాడు. నాలుగు రోజుల కిత్రం తల్లి వద్దకు వచ్చిన సురేశ్ పెంటాకుర్దులోనే ఉంటూ ఆదివారం డబ్బుల కోసం గొడవకు పడ్డాడు. ఈ క్రమంలో మద్యం మత్తులో చంద్రకళ (59)ను కిరాతకంగా గొడ్డలితో దాడి చేసి హత్య చేశాడు. అనంతరం ఆమె కాలికి ఉన్న సుమారు 50 తులాల వెండి కడియాన్ని ఎత్తుకెళ్లాడు. సోమవారం చంద్రకళ రక్తపుమడుగులో ఉండటాన్ని చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. బోధన్ ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో రూరల్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, నిందితుడు సురేశ్ను అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్ రెడ్డి తెలిపారు.