
సరిహద్దులో ‘ఏనుగు’ అలర్ట్
చింతలమానెపల్లి(సిర్పూర్): మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దులోని అటవీ ప్రాంతంలో ఏనుగులు సంచరిస్తున్నాయనే సమాచారంతో అటవీశాఖ అధికారులు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రాణహిత నదీ తీర గ్రామాల్లోని ప్రజలను సోమవారం సాయంత్రం అప్రమత్తం చేశారు. చింతలమానెపల్లి మండలం రణవెల్లి, బూరెపల్లి, కోర్సిని తదితర గ్రామాల్లో డప్పు చాటింపు వేయించారు. గతేడాది మహారాష్ట్ర వైపు చౌడంపల్లి అటవీ ప్రాంతం నుంచి ప్రాణహిత నదిని దాటి బూరెపల్లి గ్రామం నుంచి కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోకి ఏనుగు ప్రవేశించిన నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేశారు. గతేడాది ఏప్రిల్లో మహారాష్ట్ర వైపు నుంచి వచ్చిన ఓ ఏనుగు దాడిచేయడంతో బూరెపల్లి గ్రామానికి చెందిన అల్లూరి శంకర్, పెంచికల్పేట్ మండలం కొండపల్లికి చెందిన కారు పోశన్న ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా డిప్యూ టి రేంజ్ అధికారి హైమావతి ఆధ్వర్యంలో సరిహద్దులోని గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నారు. వ్య వసాయ పనులకు వెళ్లేవారు జాగ్రత్తలు పాటించా లని, ఏనుగుపై దాడికి ప్రయత్నించవద్దని సూచించారు. నెల రోజుల క్రితం మహారాష్ట్రలోని గడ్చిరోలి పట్టణంలోని రహదారులపై ఏనుగులు తిరగడం సంచలనం సృష్టించింది. చాముర్షి తాలూకా అటవీ ప్రాంతం నుంచి ఏనుగులు ప్రాణహిత నదివైపు సంచరించే అవకాశాలు ఉన్నట్లుగా అటవీ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.