
పాఠశాలల అభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం
● డీఈవో రామారావు
నిర్మల్ రూరల్: పాఠశాలల అభివృద్ధిలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల పాత్ర కీలకమని డీఈవో రామారావు అన్నారు. జిల్లా కేంద్రంలోని నారాయణ పాఠశాలలో మంగళవారం ప్రారంభమైన చివరి విడత ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. ఉపాధ్యాయులు తమ బడులను అన్నిరంగాల్లో అభివృద్ధి చేయాలని సూచించారు. విద్యార్థుల నమోదు, విద్యా ప్రగతి, విద్యా కార్యక్రమాల నిర్వహణ, విద్యార్థుల్లో సంపూర్ణ అభివృద్ధి, పాఠశాలల్లో నూతన కార్యక్రమాల అమలు, విద్యార్థులను పోటీ పరీక్షల్లో పాల్గొనేలా చేయడం, విద్యార్థులు అన్ని రంగాల్లో ముందంజలో ఉండేలా చూసుకోవడం తదితర అంశాలపై దృష్టి పెట్టాలని వివరించారు. విద్యార్థుల ప్రగతిని ఎప్పటికప్పుడు గుర్తిస్తూ అభినందనలు తెలపాలన్నారు. అనంతరం బాలశక్తి శిక్షణ కార్యక్రమం జిల్లా ఇన్చార్జి దేవిప్రియ మాట్లాడుతూ బాలశక్తి కార్యక్రమం 4 ప్రధాన ఉద్దేశాలను వివరించారు. జూన్ 15 నుంచి జిల్లాలోని 118 ఉన్నత పాఠశాలల్లో ప్రారంభిస్తున్నామన్నారు. ఇందులో ఏఎంవో నరసయ్య, సీఎంవో ప్రవీణ్ కుమార్, రీసెర్చ్ ఉపాధ్యాయులు తోడిశెట్టి పరమేశ్వర్, మైసాజి, రాజశేఖర్, విజయ్కుమార్ పాల్గొన్నారు.