
కార్మికులు హక్కుల కోసం పోరాడాలి
● జిల్లా జడ్జి రాధిక
నిర్మల్చైన్గేట్:కార్మికులు న్యాయమైన హక్కుల కోసం పోరాడాలని జిల్లా జడ్జి రాధిక సూచించారు. 139వ ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ఇండియా ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని భగత్ సింగ్ భవన్లో కార్యక్రమం నిర్వహించారు. జిల్లా జడ్జి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్మికులు హక్కులు, బాధ్యతలు తెలుసుకుని పనిచేయాలని సూచించారు. ఇందు కోసం పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. టీయూసీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రాజన్న మాట్లాడుతూ కేంద్రంలో మోదీ సర్కార్ కార్మిక ప్రజావ్యతిరేక విధాలు అనుసరిస్తూ కార్మిక, రైతు వ్యతిరేక చట్టాలు తీసుకువచ్చి ప్రజల హక్కులను కాలరాస్తున్నారన్నారు. కార్మికుల హక్కులను కాలరాసే నల్ల చట్టాలను రద్దు చేయాలన్నారు. 12 గంటల పని పెంపుదలకు వ్యతిరేకంగా కార్మికులందరూ ఐక్య పోరాటం చేయాలన్నారు. కార్యక్రమంలో టీయూసీఐ జిల్లా అధ్యక్షుడు బక్కన్న, జిల్లా కార్యదర్శి రామ లక్ష్మణ్, పీవోడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మి జిల్లా నాయకులు గంగామణి, రేష్మ, భీమవ్వ, ముత్తక్క, భూషణ్, గంగాధర్, పోశెట్టి, రాజేందర్, ఎల్లయ్య పాల్గొన్నారు.