తమిళనాడులో టీవీకే మద్దతు అంశంలో ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఈ అంశమై కాంగ్రెస్ అగ్రనేత కేసీ వేణుగోపాల్ తొలిసారిగా స్పందించారు. విజయ్ పార్టీకి మద్దతు ఇచ్చే అంశంలో తమిళనాడు కాంగ్రెస్ నిర్ణయమే ఫైనల్ అన్నారు. ఈ అంశంలో రాష్ట్ర పార్టీనే తుది నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నివాసంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, జయరాం రమేష్ సమావేశమయ్యారు. ఐదు రాష్ట్రాల ఫలితాలపై అగ్రనాయకులు విశ్లేషణ జరిపారు.
అయితే తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని కాంగ్రెస్ను ఇదివరకే పలుమార్లు విజయ్ కోరారు. ఈ నేపథ్యంలోనే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు లేఖసైతం రాశారు. ఈ నేపథ్యంలోనే విజయ్ అభ్యర్థనను పరిగణలోకి తీసుకొని తగిన విధంగా నిర్ణయం తీసుకోవాలని పార్టీ నేతలకు సూచించారు. కాగా కాంగ్రెస్ విజయ్ పార్టీకి మద్ధతివ్వడం దాదాపుగా ఖరారైనట్లేనని తెలుస్తోంది .
ఈ అంశమై ఇది వరకే హస్తం నేతలు టీవీకేకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా టీవీకే 108 స్థానాల్లో నెగ్గగా ప్రభుత్వ ఏర్పాటుకు మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. కాంగ్రెస్ అక్కడ ఐదు స్థానాల్లో గెలుపొందింది. ఈ నేపథ్యంలో హస్తం మద్దతు కీలకం కానుంది.


