ప్రజలే చేస్తున్న అభివృద్ధి ఇది: ప్రధాని మోదీ | Narendra Modi addresses Hindustan Times Leadership Summit | Sakshi
Sakshi News home page

ప్రజలే చేస్తున్న అభివృద్ధి ఇది: ప్రధాని మోదీ

Nov 17 2024 4:41 AM | Updated on Nov 17 2024 5:11 AM

Narendra Modi addresses Hindustan Times Leadership Summit

మేం ఆ ప్రగతి కోసం పాటుపడుతున్నాం

హెచ్‌టీ లీడర్‌షిప్‌ సదస్సులో ప్రధాని మోదీ వ్యాఖ్య

న్యూఢిల్లీ: గత ప్రభుత్వాలు ఓటు బ్యాంక్‌ రాజకీయాల కోసమే పలు పథకాలు తీసుకొచ్చాయని మేం మాత్రం ప్రజల అభివృద్ధే లక్ష్యంగా పాటుపడుతున్నామని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. శనివారం ఢిల్లీలో హిందుస్తాన్‌ టైమ్స్‌ లీడర్‌షిప్‌ సమ్మిట్‌లో పాల్గొన్న సందర్భంగా ప్రధాని మోదీ కీలకోపన్యాసం చేశారు. ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. 

అసమానతలు పెరిగిపోతున్నాయి 
‘‘ప్రజాప్రగతి కోసం ప్రజలే స్వయంగా పాటుపడుతున్నారు. మేం ఆ ప్రజాయజ్ఞం దిగి్వజయం కావడానికి కృషిచేస్తున్నాం. కానీ గత ప్రభుత్వాలు తమ ఓటు బ్యాంక్‌ రాజకీయాల కోసమే పథకాలు తీసుకొచ్చాయి. దీంతో ఆ ప్రభుత్వాలు సమాజంలో అసమానతలకు హేతువులయ్యాయి. దీంతో నేడు సామాజిక తులాభారంలో అసమతుల్యత రోజురోజుకూ మరింత పెరుగుతోంది. ఆ ఓటు బ్యాంక్‌ రాజకీయాలకు మేం చాలా దూరం. మా ప్రభుత్వం ప్రజల్లో విశ్వాసాన్ని మళ్లీ పెంపొందించింది. 90వ దశకంలో భారత్‌ పదేళ్లలో ఐదుసార్లు ఎన్నికలను చవిచూసింది.

ఆనాడు దేశంలో ఎంతో అస్థిరత తాండవించింది. భారత్‌లో పరిస్థితులు ఇకమీదట ఎప్పుడూ ఇలాగే ఉంటాయని రాజకీయ పండితులూ తరచూ విశ్లేషణలు చూసేవారు. ఇప్పుడు చాలా దేశాల్లో అంతర్యుద్ధం, ఆర్థికసంక్షోభం, అస్థిరత రాజ్యమేలుతున్నాయి. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లోనూ భారతీయ ఓటర్లు మమ్మల్ని నమ్మి మూడోసారి అవకాశం ఇచ్చారు. ప్రజల కోసం భారీగా ఖర్చుపెట్టాలి. ప్రజల కోసం భారీగా ఆదాచేయాలి. ఈ శతాబ్దిని భారతీయ శతాబ్దిగా అందరూ గుర్తుంచుకుంటారు’’అని మోదీ అన్నారు. హిందుస్తాన్‌ టైమ్స్‌ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా మోదీ స్మారక తపాలా బిళ్లను ఆవిష్కరించారు.  

రిస్క్‌ చేసే సంస్కృతిని పోగొట్టారు 
సవాళ్లను భారత్‌ ఎదుర్కొంటున్న తీరుపై మోదీ స్పందించారు. ‘‘మన ముందుతరాల వాళ్లు సవాళ్లను స్వీకరించారు. రిస్క్‌ తీసుకోవడం వల్లే మనం ఇప్పుడు మన వస్తు, సేవలను విదేశాలకూ అందించగల్గుతున్నాం. దాంతోపాటే వాణిజ్యం, సంస్కృతికి భారత్‌ కేంద్రంగా పరిఢవిల్లింది. అయితే భారత స్వాతం్రత్యానంతరం ఈ రిస్క్‌ తీసుకునే సుగుణాన్ని గత ప్రభుత్వాలు కోల్పోయాయి. మా హయాంలో గత పదేళ్లుగా భారత్‌ మళ్లీ రిస్క్‌ తీసుకోవడానికి కావాల్సిన శక్తిసామర్థ్యాలను అందిస్తోంది’’అని అన్నారు.  

నాడు భయపెట్టి ఇప్పుడదే భయపడుతోంది 
‘‘ఈ సదస్సు సందర్భంగా ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్‌లో పాత దినపత్రికలను చదివా. 1947 అక్టోబర్‌లో జమ్మూకశీ్మర్‌ భారత్‌లో విలీనంవేళ భారతీయుల ఆనందం వార్త చదివి నేను కూడా అంతేస్థాయిలో పరమానందభరితుడినయ్యా. అయితే గత ప్రభుత్వాల కారణంగా ప్రజలను ఉగ్రవాదం భ యపెట్టేది. పొరుగుదేశాల సీమాంతర ఉగ్రవాదం కారణంగా భారతీయులు సొంత ఇళ్లు, నగరాల్లోనూ ఉండటానికి జంకారు. ప్రభుత్వాల నిర్ణయాత్మకంగా వ్యవహరించపోవడం వల్ల ఏడుదశాబ్దాల పాటు కశ్మీర్‌ హింసను చవిచూసింది. ఇప్పుడు కాలం మారింది. మా ప్రభుత్వాల హయాంలో ఉగ్రవాదం దాని సొంత దేశం(పాకిస్తాన్‌)లో కూడా భయపడుతోంది. ఇప్పుడు కశ్మీర్‌లో కూడా రికార్డ్‌ స్థాయిలో ఓటింగ్‌ నమోదవుతోందని ఈనాటి పత్రికల్లో వస్తోంది’’అని అన్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement