న్యూఢిల్లీ: ఫలితాలొచ్చి పది రోజులైనా కేరళ ముఖ్యమంత్రి పదవికి ఎవరు అర్హులనే అంశాన్ని తేల్చుకోలేక తీవ్రంగా సతమతమవుతున్న కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఎట్టకేలకు గురువారం సీఎం పేరును ప్రకటించనుంది. రోజుల తరబడి సస్పెన్స్, సంప్రదింపులు, లాబీయింగ్, మంతనాల మారథాన్కు ముగింపు పలుకుతూ గురువారం ముఖ్యమంత్రి పేరును ప్రకటించబోతున్నామని పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ బుధవారం ఢిల్లీలో వెల్లడించారు.
పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో 40 నిమిషాల పాటు తుది మంతనాలు జరిపాక నూతన ముఖ్యమంత్రి అంశంలో స్పష్టత వచ్చిందని జైరాం రమేశ్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ సారథ్యంలోని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్(యూడీఎఫ్) కూటమి కేరళ శాసనసభ స్థానాల్లో భారీ మెజార్టీతో గెల్చిన విషయం విదితమే. ప్రజాస్వామ్యయుతమైన అన్ని ప్రక్రియలను ఆచరిస్తూ సీఎం పేరును ప్రకటిస్తున్నామని జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు. తొలి నుంచీ ముఖ్యమంత్రి పదవి రేసులో కేరళ అసెంబ్లీలో విపక్షనేత వీడీ సతీశన్, సీనియర్ కాంగ్రెస్ నేత రమేశ్ చెన్నితల, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి(వ్యవస్థాగతం) కేసీ వేణుగోపాల్లు బరిలో ఉన్నారు.


