భారత్‌, పాక్‌ ఉద్రిక్తతలు.. అరుణాచల్‌లో చైనా దూకుడు | China attempts to rename certain places in Arunachal Pradesh | Sakshi
Sakshi News home page

భారత్‌, పాక్‌ ఉద్రిక్తతలు.. అరుణాచల్‌లో చైనా దూకుడు

May 14 2025 11:06 AM | Updated on May 14 2025 1:07 PM

China attempts to rename certain places in Arunachal Pradesh

ఢిల్లీ: భారత్‌ విషయంలో డ్రాగన్‌ దేశం చైనా మరోసారి వక్రబుద్ధిని చూపించింది. ఈశాన్య భారతంలో సరిహద్దు రాష్ట్రమైన అరుణాచల్‌ ప్రదేశ్‌లో పలు స్థలాల పేర్లను చైనా మార్చింది. ఈ నేపథ్యంలో చైనాపై భారత్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. పేరు మార్చినంత మాత్రాన, వాస్తవాలు మారవని తెలుసుకోవాలన్న భారత విదేశాంగ శాఖ హితవు పలికింది.

భారత్‌, పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ చైనా మరోసారి తన వక్రబుద్దిని చూపించింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని స్థలాలను సౌత్ టికెట్‌గా చైనా పేర్లు మార్చింది. ఈ నేపథ్యంలో చైనాపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైస్వాల్‌ స్పందిస్తూ..‘అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్ లో అంతర్భాగమే. అరుణాచల్ ప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాల పేరు మార్చడాన్ని ఖండిస్తున్నాం. పేరు మార్చినంత మాత్రాన, వాస్తవాలు మారిపోవు. అరుణాచల్‌లోని పలు ప్రదేశాలకు పేర్లు పెట్టడానికి చైనా వ్యర్థ, విఫల ప్రయత్నాలు చేస్తున్నట్లు మేం గమనించాం. ఇది మా వైఖరికి విరుద్ధం. అలాంటి ప్రయత్నాలను కచ్చితంగా తిరస్కరిస్తాం’ అని చెప్పుకొచ్చారు.

అయితే, అరుణాచల్‌ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల పేర్లను చైనా ఇప్పటికే పలుమార్లు మార్చింది. పేర్లను మార్చేందుకు ప్రయత్నిస్తూ నాలుగు జాబితాలను విడుదల చేసింది. 2017లో ఆరు ప్రదేశాలకు పేర్లు మార్చుతూ ఓ జాబితా విడుదల చేసింది. ఆ తర్వాత 2021లో 15 ప్రాంతాలకు, 2023లో 11 ప్రాంతాలకు, 2024లో మరో 30 ప్రాంతాలకు పేర్లను మార్చుతూ చైనా జాబితాను విడుదల చేసింది. చైనా చేస్తున్న వాదనలకు భారత్‌ ఎప్పటికప్పుడు గట్టి సమాధానమిస్తోంది. గత ఏడాది అరుణాచల్‌ప్రదేశ్‌లోని 30 ప్రాంతాలకు చైనీస్‌, టిబెటెన్‌ పేర్లను పెట్టింది. ఇలాంటి ప్రయత్నాలను భారత్‌ ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement